పెళ్లి ఇంట్లో డప్పులు, మేళతాళాలు, బంధుమిత్రుల సందడితో కళకళలాడాల్సిన వేడుక ఒక్కసారిగా విషాదంగా మారింది. పెళ్లి తంతు జరుగుతుండగానే వరుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పెళ్లి మండపం ఆనందానికి బదులుగా విషాదంతో నిండిపోయింది. ఈ హృదయ విదారక ఘటన బీహార్ రాష్ట్రంలోని మోతిహారి జిల్లాలోని రామ్గఢ్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని చిక్నీ గ్రామంలో చోటుచేసుకుంది.
పెళ్లి వేడుకలోనే అస్వస్థత
సమాచారం ప్రకారం, మఝౌలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్వాలియా గ్రామానికి చెందిన 25 ఏళ్ల శక్తినాథ్ శర్మ వివాహ ఊరేగింపు ఘనంగా చిక్నీ గ్రామానికి చేరుకుంది. వధువు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికి అతిథులకు విందు ఏర్పాటు చేశారు. అనంతరం వివాహ తంతు ప్రారంభమైంది. వధూవరులు మండపంలో కూర్చున్న సమయంలో వరుడికి అకస్మాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు అతడిని మెరుగైన చికిత్స కోసం రక్సౌల్లోని ఎస్ఆర్పీఎస్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునే సరికి వరుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. వరుడి మృతివార్త తెలియగానే ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి సంబరాలు ఒక్కసారిగా శోకసంద్రంగా మారాయి.
కన్నీరుమున్నీరైన వధువు
వధువు రఘుని కుమారి వివాహం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, పెళ్లి మండపంలోనే వరుడు మృతి చెందడంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. కాళ్ల పారాణఇ ఆరకముందే ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
కుటుంబంలో చిన్నవాడే వరుడు
మృతుడు శక్తినాథ్ శర్మ ముగ్గురు సోదరుల్లో చిన్నవాడు. అతని తల్లిదండ్రులు ఇప్పటికే మరణించగా, అన్నయ్య సంరక్షకుడిగా వ్యవహరిస్తూ ఎంతో ఆశతో ఈ వివాహాన్ని ఏర్పాటు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో భర్వాలియా గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన వేళ ఇలా విషాదం చోటుచేసుకోవడంతో స్థానికులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

