భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఖుషీ బార్&రెస్టారెంట్ ముందు మందుబాబులు వీరంగం చేశారు. అది కూడా రాత్రిపూట కాదు. మిట్ట మధ్యాహ్నం ఆ బార్&రెస్టారెంట్ లో మద్యం సేవించి నానా బీభత్సం చేశారు. బాగా తాగిన మత్తులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.మద్యం సేవించి అనంతరం మాట మాట పెరగడంతో ఇరు వర్గాలు ఘర్షణ పడి బార్ ముందు గొడవ సృష్టించారు.
ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బీర్ సీసాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇరువురికి తలకు గాయాలయ్యాయి. ఈ మందుబాబులు అంబేద్కర్ సెంటర్ కి చెందిన వారిగా తెలుస్తోంది. కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ రోడ్డుపై భయభ్రాంతులు సృష్టిస్తూ దాడులకు పాల్పడడం గమనార్హం. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.