DELHI: సిగరెట్ వెలిగించుకునేందుకు అగ్గిపుల్ల ఇవ్వాలేదనే విషయంపై జరిగిన చిన్న వివాదం ఒక యువకుడి హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఢిల్లీలోని కేశవ్పురంలో జరిగింది. మరణించిన వ్యక్తిని 30 ఏళ్ల భవానీగా గుర్తించారు. ఈ ఘటనలో మరో వ్యక్తి గాయపడ్డారు. ఈ నేరంలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కేశవ్పురం ప్రాంతంలో ఓ వైన్ షాపు ముందు భవానీ, ఆశారామ్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇదే సమయంలో ముగ్గురు వ్యక్తులు వారిని సిగరెట్ వెలిగించుకునేందుకు అగ్గిపుల్ల ఇవ్వాలని కోరారు.
తమ వద్ద అగ్గిపెట్టే లేదని చెప్పడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడివ తీవ్రం కావడంతో నిందితులు ఇద్దరిపై దాడికి పాల్పడి, కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో భవానీ తీవ్రంగా గాయపడగా, అతడిని వెంటనే దీప్ చంద్ర బంధు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. భవానీ పొట్లలో ఎడమవైపు తీవ్రమైన గాయమైనట్లు పోలీసులు తెలిపారు. మరో బాధితుడు ఆశారామ్ ఛాతిలో కత్తిపోటుకు గురయ్యాడు.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నరేశ్ బహదూర్ అలియాస్ నేపాలీ (19)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు తరుణ్ (19), మరో మైనర్ నేరస్తుడిని కూడా పట్టుకున్నట్లు వెల్లడించారు. నరేష్ కత్తితో దాడిచేసినట్లు తేలింది. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య నేరాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

