చెన్నైలోని ఫాంహౌస్ లో ఎన్ఆర్ఐ దంపతులను హత్య చేసి భారీగా బంగారం, నగదుతో పరారవుతున్న ఇద్దరు నిందితులను ప్రకాశం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. శనివారం సాయంత్రం టంగుటూరు టోల్ ప్లాజా వద్ద కాపుకాసిన పోలీసులు తమిళనాడు రిజిస్ట్రేషన్ కారు (టీఎన్ 07 ఏడబ్ల్యూ 7499) ను ఆపారు. అందులో ఉన్న ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
అమెరికాలో ఉంటున్న శ్రీకాంత్ (58), అనురాధ(53) దంపతులకు చెన్నైలోని మైలవరం ప్రాంతంలో ఫాంహౌస్ ఉంది. శనివారం ఉదయం వారిద్దరూ విమానంలో చెన్నైకి వచ్చారు. వారి ఫాంహౌస్ లో నేపాల్కి చెందిన పదం లాల్ శర్మ వాచ్ మన్ గా, అతని కుమారుడు పధం లాలకృష్ణ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. విమానాశ్రయం నుంచి శ్రీకాంత్ దంపతులను కారులో ఫాంహౌస్ కు తీసుకొచ్చే సమయంలోనే లాలకృష్ణ మార్గమధ్యంలో తన స్నేహితుడైన పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ కు చెందిన రవిని కారులో ఎక్కించుకున్నాడు. ఫాంహౌస్ కు తీసుకెళ్లారు.
ఫాంహౌస్ కు తీసుకెళ్లిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం వారిని లాల్కృష్ణ, రవి హత్య చేసి, అక్కడే పాతిపెట్టారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదును నాలుగు సూట్కేసుల్లో సర్దుకొని కారులో చెన్నై నుంచి నేపాల్కు బయలుదేరారు. చెన్నై పోలీసులకు విషయం తెలియడంతో అక్కడి ఏసీపీ డాక్టర్ కన్నన్ వెంటనే ఆంధ్రాలో ఉన్న అన్ని జిల్లాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒంగోలు ఎస్పీ మలిక గర్గ్ జాతీయ రహదారిపై ఉన్న అన్ని స్టేషన్లను అప్రమత్తం చేశారు.
టంగుటూరు టోల్ప్లాజా వద్ద సింగరాయకొండ సీఐ యం.లక్ష్మణ్, టంగుటూరు ఎస్సై ఖాదర్బాషా వాహనాలు తనిఖీ చేపట్టారు. కారు నంబరు ముందుగానే తెలియడంతో అప్రమత్తంగా వ్యవహరించారు. సాయత్రం ఆరు గంటలకు కారు రాగానే టోల్ప్లాజా వద్ద నిలిపివేశారు. అందులో ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నాలుగు సూట్కేసుల్లో ఉన్న నగలు, నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు, కందుకూరు సీఐ శ్రీరామ్ నిందితులను విచారిస్తున్నారు.
నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ మలిక గర్గ్ అభినందించారు. చెన్నై పోలీసులకు సమాచారం ఇచ్చామని, నిందితులతో పాటు కారు, సూట్కేసులను వారికి అప్పగిస్తామని తెలిపారు. కాగా, ఆ సూట్కేసుల్లో 50 కిలోల బంగారం, 5 కిలోల వెండి, నగదు వున్నట్టు చెన్నై పోలీసులు చెబుతున్నారు.
Telangana :పెట్రోల్ కోసం పక్క రాష్ట్రానికి పయనం