Site icon NTV Telugu

Charlapalli Case Solved: వీడిన చర్లపల్లి తల్లీపిల్లల సూసైడ్ మిస్టరీ.. ఆ మరణశాసనం వెనుక కారణం ఇదే.!

Charlapalli Case

Charlapalli Case

Charlapalli Case Solved: బోడుప్పల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ టీమ్ లీడర్ విజయశాంతిరెడ్డి (38), తన కుమార్తె చైతన్య రెడ్డి (18), కుమారుడు విశాల్ రెడ్డి (17)తో కలిసి జనవరి 31 తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతో ఉన్నత స్థాయిలో ఉండి, పిల్లలు కూడా బాగా చదువుకుంటున్న సమయంలో వీరు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొన్ని రోజులుగా ఈ కేసులో మిస్టరీ కొనసాగగా, తాజాగా పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ రెడ్డి దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయనను కూడా పోలీసులు విచారించారు. కుటుంబంలో ఎటువంటి తగాదాలు లేవని, ఆస్తి పరంగా గానీ, ఆర్థికంగా గానీ ఎటువంటి ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. విజయశాంతి రెడ్డికి తన తోటి ఉద్యోగులతో గానీ, ఇరుగుపొరుగు వారితో గానీ ఎటువంటి విభేదాలు లేవని ప్రాథమిక విచారణలో తేలింది.

రైల్వే స్టేషన్ వద్ద లభించిన సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ ముగ్గురూ చాలా ప్రశాంతంగా ప్లాట్‌ఫారమ్‌లపై తిరుగుతున్నట్లు కనిపించారు. ఎక్కడా వారు భయం గానీ, ఆందోళన గానీ ఉన్నట్లు కనిపించలేదు. ఆత్మహత్యకు ముందు విజయశాంతి తన కారులో ఒక లేఖను (సూసైడ్ నోట్) ఉంచారు. అందులో “మా చావుకు ఎవరూ కారణం కాదు” అని మాత్రమే రాసి ఉంది, కానీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారో స్పష్టంగా పేర్కొనలేదు. ఈ లేఖ కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారంగా మారింది.

పోలీసుల విశ్లేషణ ప్రకారం.. విజయశాంతి తీవ్రమైన ఒంటరితనంతో (Loneliness) కుంగిపోయినట్లు తెలుస్తోంది. భర్త విదేశాల్లో ఉండటం, పిల్లలు చదువుల్లో బిజీగా ఉండటం, తానూ ఉద్యోగ బాధ్యతల్లో ఉంటూ మానసిక వేదనకు గురైనట్లు అనుమానిస్తున్నారు. పిల్లలు కూడా తల్లి మాటే శిరోధార్యంగా భావించి, ఆమె చెప్పినదానికి సమ్మతించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కారులో తల్లి పిల్లలకు చేసిన బోధనలు వారిపై తీవ్ర ప్రభావం చూపి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

 

 

 

Exit mobile version