NTV Telugu Site icon

West Bengal: కోల్‌కతాలో ఘోరం.. మెడికల్ విద్యార్థిని హత్య.. పరిస్థితి ఉద్రిక్తత

Rgkarmedicalcollege

Rgkarmedicalcollege

పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ శవమై కనిపించింది. సెమినార్ హాల్‌లో నగ్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేపట్టారు. అలాగే పలు పార్టీల నేతలు కూడా మద్దతుగా నిలిచారు. తమ కుమార్తెపై అత్యాచారం చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బాధిత తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

మృతురాలు ఛాతీ మెడిసిన్ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గురువారం రాత్రి విధుల్లో ఉంది. శరీరంపై గాయాల గుర్తులు ప్రత్యక్షమయ్యాయి. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గురువారం రాత్రి డ్యూటీలో ఉన్న సిబ్బందిని విచారిస్తున్నారు. అసలేం జరిగిందన్న అంశంపై వాకబు చేస్తున్నారు. కేసును కప్పిపుచ్చేందుకు కుట్ర జరుగుతోందని బాధితురాలి తండ్రి ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని ఎమర్జెన్సీ భవనంలోని సెమినార్ హాల్‌లో తోటి విద్యార్థులు కనుగొన్నారని తెలిపారు. గత రాత్రి ఆమెతో డ్యూటీలో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతరులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు వెల్లడించారు. రిపోర్టు రాగానే అసలు విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. ఆమె చెంపలు, ముక్కు చుట్టూ, పెదవులు, కనుబొమ్మల మధ్య మరియు మెడపై గీతలు ఉన్నాయన్నారు. ఏదో పోరాటం జరిగినట్లుగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే.. ఆమెపై లైంగిక వేధింపులు జరిగాయా.. లేదంటే హత్యకు గురైందా? అనేది పోలీసులకు అర్థమవుతుందని చెప్పారు.

ఆసుపత్రి వైద్యుడు మాట్లాడుతూ.. బాధితురాలు దాదాపు అర్ధరాత్రి 2 గంటలకు తన జూనియర్‌లతో కలిసి డిన్నర్ చేసిందన్నారు. విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకంగా రూమ్ లేకపోవడంతో ఆమె సెమినార్ గదికి వెళ్లిందన్నారు. ఉదయం చూస్తే ఆమె మృతదేహం లభించిందని చెప్పారు.

ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎన్‌ఎస్‌ నిగమ్‌, కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ గోయల్‌.. ఆస్పత్రిని సందర్శించి వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ట్రైనీ డాక్టర్ మృతిపై విచారణకు ఆసుపత్రి అధికారులు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లోని పిజిటి వైద్యులు ఆందోళన చేపట్టారు. పలు విద్యార్థి సంఘాలు ర్యాలీ చేపట్టాయి. అలాగే ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్‌తో సహా పలువురు విపక్ష బీజేపీ నేతలు కూడా ఆసుపత్రిని సందర్శించి మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.