Bengaluru Shocker: చిన్న చిన్న కారణాలే కుటుంబాల్లో కల్లోలాలు రేపుతున్నాయి. మనస్పర్థలతో ఆత్మహత్యలు, హత్యకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూర్లో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న ఘటన భార్య ఆత్మహత్యకు కారణమైంది. 3 రోజుల క్రితం నాటి ‘‘సాంబార్’’ను పదే పదే వడ్డించడంపై జరిగిన వివాదంలో 27 ఏళ్ల మహిళ మృతి చెందింది. గురువారం సాంబార్ విషయంలో భర్తతో జరిగిన గొడవ తర్వాత కావ్య అనే మహిళ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.
Read Also: Telangana: పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్.. ఆ పని చేసినందుకే ఇలా..
కావ్యకు రంగస్వామితో 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి నాలుగేళ్ల బిడ్డ ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మూడు రోజుల క్రితం తయారు చేసిన సాంబార్ను మళ్లీ వేడి చేసి వడ్డించి తర్వాత దంపతుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ సమయంలో భర్త, కావ్యను తీవ్రంగా దుర్భాషలాడాడు. ఆమెపై దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘర్షణ తర్వాత కావ్య వ్యవసాయం కోసం వినియోగించే పురుగుల మందు సేవించిందని చెబుతున్నారు. వాంతులు కావడంతో ఆమె పురుగుల మందు తాగిందనే విషయాన్ని గుర్తించిన కుటుంబీకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గం మధ్యలో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
