TCS: వరస లేఆఫ్స్ తో టెక్ రంగంలో అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) నిర్ణయం ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది. వేరియబెల్ పే విధానాన్ని మార్చి, ఆఫీస్ హాజరుతో లింక్ చేయడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 6 లక్షల మంది ఉద్యోగులపై ఇది ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు వేరియబుల్ పే రూపంలో నెలవారీగా లేదా క్వార్టర్లీ వారీగా అందుతున్న మొత్తాన్ని ఇప్పటి నుంచి ‘‘మంత్లీ పర్ఫామెన్స్ పే’’గా మార్చారు. దీంతో ఉద్యోగులు ఆఫీస్ హాజరు, ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ ఆధారంగా నిర్ణయించనున్నారు. దీని కారణంగా ఆఫీస్ తక్కువగా వచ్చే ఉద్యోగులకు టేక్-హోమ్ సాలరీ తగ్గే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు, ఈ ఏడాది టీసీస్ సాధారణంగా 5 శాతం నుంచి 8 శాతం వరకు జీతాలను పెంచినట్లు సమాచారం. మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులకు A+ కేటగిరీలో చేర్చి, 10 శాతం నుంచి 13 శాతం వరకు పెంచినట్లు తెలుస్తోంది. తక్కువ రేటింగ్ పొందిన వారికి కేవలం 2 శాతం నుంచి 3 శాతం వరకు మాత్రమే పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, దేశంలో కొత్త లేబర్ కోడ్స్కు అనుగుణంగా కంపెనీ వేతన నిర్మాణాన్ని అమలు చేస్తున్నట్లు టీసీఎస్ చెబుతోంది.
కొంత మంది ఉద్యోగులకు నెలవారీ వేరియబుల్ పే తగ్గినట్లు తెలుస్తోంది. కొందరికి త్రైమాసిక లేదా వార్షిక జీతం మారింది. గ్రుచ్యుటీ కూడా సీటీసీలో కనిపించడం లేదని మరికొందరు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, కొత్త విధానంలో వేరియబుల్ పేను రెండు భాగాలుగా విభజించినట్లు సమాచారం. మంత్లీ పర్ఫామెన్స్ పే, పర్ఫామెన్స్ బోనస్ రూపంలో క్వార్టర్లీకి బదులుగా వార్షికంగా చెల్లించే అవకాశం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ రెండు అంశాల్లో కోత పడితే టేక్ హోం సాలరీ తగ్గుతుంది. మరోవైపు, మేనేజర్లు ఎక్కువ మంది ఉద్యోగుల్ని తక్కువ పనితీరు కేటగిరి ‘‘Band D’’లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ కేటగిరీలో ఉన్న ఉద్యోగుల జీతాలు, ఉద్యోగ భద్రతపై ప్రభావం ఉండొచ్చని భయం మొదలైంది.
