గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’ అనే వినూత్న విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో వ్యక్తుల ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడానికి ‘సిబిల్’ (CIBIL) ఎలాగైతే ప్రామాణికమో.. అదే తరహాలో గ్రామీణ ప్రజలు, రైతులు , స్వయం సహాయక సంఘాల రుణ అర్హతను గుర్తించేందుకు ఈ ప్రత్యేక స్కోర్ను రూపొందించనున్నారు.
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మందికి బ్యాంకింగ్ లావాదేవీల చరిత్ర (Credit History) ఉండదు. దీనివల్ల వారు రుణాలు పొందడం కష్టతరంగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి.. వారి ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం కేవలం బ్యాంక్ లావాదేవీలనే కాకుండా ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది.
Also Read:Telangana: ఇంధన నిల్వలు తెలంగాణ సర్కార్ కీలక అప్డేట్..
వినియోగ బిల్లులు అంటే విద్యుత్ బిల్లుల చెల్లింపుల తీరు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా పొందుతున్న లబ్ధి, వాటి వినియోగం, కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC), ట్రాక్టర్ రుణాలు, ప్రాధాన్యత రంగ రుణాల చెల్లింపుల చరిత్రలు వీటిలో పరిగణలోకి తీసుకుంటారు. 2025-26 ఆర్థిక బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ విధానం ద్వారా గ్రామీణ రుణ మంజూరు ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. అందులో.. మొదటిసారి లోన్ తీసుకునే వారికి, ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేని వారికి ఈ స్కోర్ ఆధారంగా బ్యాంకులు వేగంగా రుణాలు మంజూరు చేస్తాయి. గ్రామీణ క్రెడిట్ స్కోర్ బాగున్న వారికి తక్కువ వడ్డీకే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు నిధులు అందుతాయి.
రుణగ్రహీత ఆర్థిక స్థితిని కచ్చితంగా అంచనా వేయడం ద్వారా బ్యాంకులు మోసపూరిత రుణాలను అరికట్టవచ్చు. ట్రాన్స్ యూనియన్ సిబిల్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ఇప్పటికే ఈ డేటాను విశ్లేషించడం ప్రారంభించాయి. ఈ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వెసులుబాటు పెరగడమే కాకుండా, అట్టడుగు వర్గాలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువవుతాయి.