Site icon NTV Telugu

Reliance Industries: పాపం అంబానీ.. ఒక్కరోజులో రూ.82 వేల కోట్లు లాస్! కారణం ఇదే..

Reliance Industries

Reliance Industries

Reliance Industries: భారత స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా పతనమయ్యాయి. డీజిల్, ఏటీఎఫ్ (విమాన ఇంధనం) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ పన్నును తిరిగి విధించడమే ఈ పతనానికి ప్రధాన కారణం అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రిలయన్స్ షేర్లు 4 శాతానికి పైగా క్షీణించాయి, ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.82,000 కోట్లు మేర పడిపోయింది. దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడం, సరఫరాలో కొరత లేకుండా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

READ ALSO: MP Kavya: గడ్డి మందుపై నిషేధం విధించాలి.. లోక్‌సభలో ఎంపీ కావ్య డిమాండ్..

డీజిల్‌పై లీటరుకు రూ.21.5, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ.29.5 ఎగుమతి సుంకాన్ని పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో అస్థిరత కొనసాగుతున్న నేపథ్యంలో, ఇంధన రంగం నుంచి వచ్చే అదనపు లాభాలను నియంత్రించడం ప్రభుత్వ ఉద్దేశ్యం. ఒకవైపు ఎగుమతులపై పన్నులు పెంచిన ప్రభుత్వం, దేశీయ వినియోగదారులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. పెట్రోల్‌పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.3 తగ్గించగా, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించింది.

రిలయన్స్ ఎగుమతులపై ప్రభావం..
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద ఏటీఎఫ్, డీజిల్ ఎగుమతిదారు. జామ్‌నగర్‌లోని రిఫైనరీలు భారత మొత్తం ఏటీఎఫ్ ఉత్పత్తిలో దాదాపు నాలుగో వంతు వాటాను కలిగి ఉన్నాయి. ఎగుమతులపై పన్ను పెరగడం వల్ల కంపెనీ లాభదాయకత దెబ్బతింటుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించారు. కాగా, ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను రిలయన్స్ తీవ్రంగా ఖండించింది. రిలయన్స్ వంటి హెవీవెయిట్ స్టాక్ పడిపోవడంతో సెన్సెక్స్, నిఫ్టీలపై కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ ప్రభావంతో సూచీలు దాదాపు 2% మేర నష్టపోయాయి. గత నెల రోజుల్లో రిలయన్స్ స్టాక్ సుమారు 3% పతనమవ్వడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది.

READ ALSO: Hey Balwanth: ఓటీటీలోకి సుహాస్ ‘హే బల్వంత్’ సినిమా.. స్ట్రీమింగ్ ఆ రోజే!

Exit mobile version