ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మరో సారి పెంచింది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు రెపోరేటును పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మూడు రోజుల చర్చల అనంతరం ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం రెపో రేటును పెంచి 4.90 శాతంగా ప్రకటించింది.రెపో రేటు లేదా తిరిగి కొనుగోలు చేసే ఎంపిక రేటు అనేది ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రెపో రేటు ముఖ్యమైన సాధనంగా పరిగణిస్తున్నారు.ద్రవ్యోల్బణం వల్ల ఇంధనంతో సహా పలు వస్తువుల ధరలు పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలను మరింతగా పెంచింది.
రెపో రేటును గత నెలలోనే 40 బేసిస్ పాయింట్ల మేర పెంచగా, తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచారు. దీంతో రెపో రేటు 4.90 శాతానికి చేరింది. అధిక ద్రవ్యోల్బణం దృష్ట్యా ద్రవ్య విధాన వైఖరిని క్రమక్రమంగా కఠినతరం చేయనున్నట్లు ఆర్బీఐ గతంలోనే సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్బీఐ ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంది. ఇలా క్రమంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆర్బీఐ రెపో రేటును 5.6 శాతానికి చేరుస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.
పరపతి విధాన నిర్ణయాలకు ఆర్బీఐ పరిగణనలోకి తీసుకునే రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 7.79 శాతానికి చేరింది. ఇది 8ఏళ్ల గరిష్ఠ స్థాయి. అయితే ద్రవ్యోల్బణం పెరగడానికి కమొడిటీలు, ముడి చమురు ధరలే కారణం. రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ఇందుకు అధిక కారణమన్నది గమనార్హం. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 13 నెలలుగా రెండంకెల స్థాయిల్లో నమోదవుతూ, ఏప్రిల్లో రికార్డు గరిష్ఠమైన 15.08 శాతాన్ని చేరింది. ఇవన్నీ రేట్ల పెంపునకు దారితీసిన అంశాలే.
కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ సవరించిన నేపథ్యంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం కానుంది. ఇక ఇప్పటికే రుణం తీసుకున్న వారికి బ్యాంకులు ఈఎంఐలలో ఎలాంటి మార్పూ చేయనప్పటికీ ఈఎంఐలు కట్టాల్సిన నెలల సంఖ్య పెరుగుతుంది. ఆ లెక్కన సుదీర్ఘకాలం పాటు ఈఎంఐలు కట్టినప్పుడు ఆ విధంగా కట్టే వడ్డీ మొత్తం పెరుగుతుంది.
RBI Repo Rate: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మరో సారి వడ్డీ రేట్లు పెరిగాయ్..

Rbi