Site icon NTV Telugu

Market Bloodbath: అక్షరాల రూ.51 లక్షల కోట్లు.. మొత్తం లాస్! ఎలాగో చూసేయండి

Indian Stock Market

Indian Stock Market

Market Bloodbath: ప్రపంచంలో అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఇండియాలోని స్టాక్ మార్కెట్‌ రక్త కన్నీరు కార్చుతూ.. ఇన్వేస్టర్లతో కంటతడి పెట్టిస్తుంది. ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. స్టాక్ మార్కెట్ పతనం మరింత తీవ్రమవుతోంది. ఈ యుద్ధం సుమారుగా నెల రోజుల క్రితం స్టార్ట్ అయ్యింది. నిజానికి చాలా మంది ఈ యుద్ధం ప్రారంభం అయినప్పుడు అది ఇంతకాలం కొనసాగుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఇప్పుడు, కాలం గడిచేకొద్దీ, యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఈ యుద్ధం ఎఫెక్ట్ ప్రధానంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాలపై పడి అది ప్రపంచ దేశాల ఆర్థిక వనరులపై ప్రత్యేక్షంగా, పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావమే ఇండియన్ స్టాక్ మార్కెట్‌పై కూడా విశేషంగా పడుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Fuel Prices: ఆ దేశాల్లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగడంతో, ప్రస్తుతం, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు $107 వద్ద ఉంది. వాస్తవానికి ఈ యుద్ధం కారణంగా అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ ఎంతలా దెబ్బతిన్నాయో తెలియదు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు మాత్రం భారీగా పతనం అయ్యాయి. ఇదే టైంలో భారత స్టాక్ మార్కెట్ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ మార్చిలో, యుద్ధం కారణంగా బీఎస్ఈ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.51 లక్షల కోట్లకు పైగా పడిపోవడంతో, ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. ఉదాహరణకు, ఈ నెలలో బీఎస్ఈ మార్కెట్ క్యాప్, ఆర్‌ఐఎల్ వంటి మూడు కంపెనీల మార్కెట్ క్యాప్‌కు సమానమైన మొత్తంలో పడిపోయింది. సెన్సెక్స్ 10,000 మార్కును దాటింది

వాస్తవానికి, ఈ యుద్ధం స్టార్ అయినప్పటి నుంచి సెన్సెక్స్ 12 శాతానికి పైగా (దాదాపు 10,000 పాయింట్లు) పడిపోయింది. మరోవైపు నిఫ్టీ 22,500 దిగువకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పతనం కారణంగా, బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ ఫిబ్రవరిలో సుమారు రూ.463 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు రూ.412 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే కేవలం ఒక్క నెలలోనే సుమారు రూ.51 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ పతనం ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ తెలియదనే చెప్పాలి. ఈ యుద్ధం ప్రపంచ చమురు ధరలలో తీవ్ర పెరుగుదలకు దారితీసింది. దీంతో ఇండియా లాంటి ప్రధాన చమురు దిగుమతిదారులపై ఒత్తిడిని పెరిగింది. ఈ అధిక చమురు ధరలు అనేవి కంపెనీల ఖర్చులను పెంచి, లాభాలను తగ్గించాయి, దీంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై నేరుగా పడి పెద్ద మొత్తంలో నష్టాలు మూటగట్టుకుంటున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలు జరపడంతో ఈ నష్టాల సమస్య మరింత పెరిగిందన్నారు. దీంతో రూపాయి కూడా తీవ్రంగా పతనమవుతూ, సోమవారం డాలర్‌తో పోల్చితే ఏకంగా రికార్డ్ స్థాయిలో 94.50 స్థాయిని దాటింది.

మార్కెట్ పతనం లార్జ్-క్యాప్ స్టాక్స్‌కే పరిమితం కాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ స్టాక్స్ కూడా గణనీయంగా పడిపోయాయి. బ్యాంకింగ్, ఆటో, వినియోగ వస్తువుల వంటి కీలక రంగాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇలాంటి ప్రపంచ సంక్షోభాల సమయంలో మార్కెట్లు తరచుగా పతనమవుతాయని, కానీ కాలక్రమేణా కోలుకుంటాయని చరిత్ర చెబుతోంది. అందువల్ల, పెట్టుబడిదారులు ఓపికగా ఉండి, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం వివేకం అని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధానికి ముందు బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, ఇప్పుడు ఆ ధరలు పెద్ద మొత్తంలో పడిపోతున్నాయి. అయితే, ఈ యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాలకు ద్రవ్యోల్బణం ముప్పును కలిగిస్తూ, బంగారం, వెండి ధరలు పడిపోవడానికి కారణమవుతోందన్నారు. ఇదే సమయంలో ఈ యుద్ధం కారణంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒక నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ.51 లక్షల కోట్లు లాస్ అయ్యాయన్నారు.

READ ALSO: Leander Paes: బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. బీజేపీలో చేరిన లియాండర్ పేస్

Exit mobile version