భారత దేశంలో మూడో అతి పెద్ద టెలికం సంస్థగా పేరు పొందిన వొడాఫోన్ – ఐడియా లిమిటెడ్లో మెజార్టీ వాటాలు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయాయి.. దీనిపై ఆ సంస్థ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.. అయితే, ఈ పరిణామాల తర్వాత స్టాక్ మార్కెట్లో వొడాఫోన్ ఐడియా షేర్లు భారీగా పడిపోయాయి.. అయితే, కంపెనీ బకాయిలను ఈక్విటీగా మార్చిన తర్వాత వొడాఫోన్ ఐడియాలో 35.8 శాతం వాటా సర్కార్ చేతిలోకి వెళ్లింది.. టెలికం మార్కెట్లో పోటీ కారణంగా.. కస్టమర్లను భారీగా కోల్పోతున్న తరుణం, పెద్దగా లాభాలు లేని పరిస్థితులు ఉండడంతో ఈ చర్య తప్పడం లేదంటూ ఆ కంపెనీ సమర్థించుకుంది.. సోమవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ వాటాకు అంగీకారం లభించింది.. ఇప్పటి వరకు యూకేకు చెందిన వొడాఫోన్ గ్రూప్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ 28.5 శాతం వాటాలు కలిగి ఉండగా, కుమార్ మంగళం బిర్లా ఆధ్వర్యంలోని ఆదిత్యా బిర్లా గ్రూప్కు 17.8 శాతం వాటా ఉంది… తాజా నిర్ణయంతో భారత ప్రభుత్వం వాటా 36 శాతానికి పెరిగింది..
Read Also: జగనన్న స్మార్ట్ టౌన్షిప్వెబ్సైట్ ప్రారంభం.. 3 కేటగిరీల్లో స్థలాల పంపిణీ
వాయిదా వేసిన స్పెక్ట్రమ్పై వడ్డీని మరియు సర్దుబాటు చేసిన స్థూల రాబడి బకాయిలను ఈక్విటీగా మార్చాలని నిర్ణయించుకున్నందున వొడాఫోన్ ఐడియాలో అతిపెద్ద వాటాదారుగా అవతరించింది ప్రభుత్వం.. గత అక్టోబర్లో కేంద్రం తన టెలికాం సంస్కరణల ప్యాకేజీలో టెలికాం కంపెనీలకు స్పెక్ట్రమ్ మరియు AGR బకాయిలపై నాలుగు సంవత్సరాల మారటోరియం మంజూరు చేసింది. వాయిదా వేసిన అప్పులపై వడ్డీని ఈక్విటీగా మార్చుకునే అవకాశం కూడా కంపెనీలకు ఇవ్వబడింది. అయితే, ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా మారవచ్చు, కంపెనీని నడపడంలో పాలుపంచుకోకపోవచ్చు అని గతంలోనే వొడాఫోన్ ఐడియా సీఈవో రవీందర్ టక్కర్ తెలిపారు. కంపెనీని ప్రభుత్వ రంగ సంస్థగా మారుస్తుందని పేర్కొనడం సరికాదన్న ఆయన.. మేం కంపెనీని సమర్ధవంతంగా మరియు పోటీతత్వంతో నడపాలని ప్రభుత్వం కోరుకుంటోంది.. ప్రభుత్వంతో నేను జరిపిన సంభాషణలన్నింటిలోనూ, భారతదేశంలో టెలికాం కంపెనీలను కొనుగోలు చేయడం మరియు నిర్వహించడం పట్ల తమకు ఆసక్తి లేదని స్పష్టంగా ప్రభుత్వం చెప్పిందని టక్కర్ తెలిపారు.
