Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!

Stock Markets Today

Stock Markets Today

Stock Markets Crash: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. వారం స్టార్ట్ అయిన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియా దేశాల మార్కెట్లలో ఇన్వెస్టర్లకు భారీ షాక్ తగిలింది. జపాన్ నుంచి దక్షిణ కొరియా, పాకిస్థాన్ వరకు ప్రధాన సూచీలన్నీ నిలువునా కుప్పకూలాయి. అయితే ఈ దారుణ పరిస్థితుల్లో భారతీయ మదుపరులకు మాత్రం అనూహ్య ఊరట లభించింది. సోమవారం గణేష్ చతుర్థి సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లు మూతపడటంతో దేశీయ మార్కెట్లను ముంచెత్తాల్సిన పెను నష్టం తాత్కాలికంగా తప్పిపోయింది.

పొరుగు దేశాల్లో పాతాళానికి సూచీలు

వారం మొదటి ట్రేడింగ్ సెషన్‌లో ఆసియా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. జపాన్ బెంచ్‌మార్క్ సూచీ ‘నిక్కీ’ ఏకంగా 500 పాయింట్లకు పైగా పతనమై 63,492 వద్దకు జారుకుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘కోస్పి’ 250 పాయింట్లు పతనమై 6,684 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు తైవాన్ మార్కెట్ 322 పాయింట్లు నష్టపోగా, పాకిస్థాన్‌కు చెందిన కరాచీ 100 (KSE) సూచీ సైతం దాదాపు 188 పాయింట్లు పడిపోయింది. మార్కెట్లు తెరిచిన క్షణం నుంచే అమ్మకాల వెల్లువ కొనసాగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది.

గణేశ్ చతుర్థి సెలవుతో తప్పిన గండం
బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సెలవుల క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత స్టాక్ ఎక్స్ఛేంజీలు క్లోజ్ చేశారు. దీంతో ఈక్విటీ (షేర్లు), ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ మార్కెట్లలో ఎలాంటి లావాదేవీలు జరగలేదు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) కూడా ఉదయం సెషన్‌లో మూతపడి, సాయంత్రం 5 గంటల నుంచి మాత్రమే కార్యకలాపాలు సాగించనుంది. ఇప్పటికే గత వారం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న దలాల్ స్ట్రీట్.. సెన్సెక్స్‌లో 2.27 శాతం, నిఫ్టీలో 2 శాతానికి పైగా క్షీణతను చూసింది. ఒకవేళ సోమవారం మన మార్కెట్లు ఓపెన్‌లో ఉండి ఉంటే, గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో దేశీయ మార్కెట్లలో మరింత కరెన్సీ రక్తపాతం నమోదై ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. సెలవు పుణ్యమా అని భారత మార్కెట్లు ఈ గండం నుంచి గట్టెక్కాయి. ఈ వారం భారత్‌లో ట్రేడింగ్ కేవలం నాలుగు రోజులు మాత్రమే జరగనుంది.

మార్కెట్ల పతనానికి కారణమేంటి?
గ్లోబల్ మార్కెట్లు ఈ స్థాయిలో కుప్పకూలడానికి మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్‌ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతుండటంతో వ్యూహాత్మక వాణిజ్య మార్గమైన హోర్ముజ్ జలసంధి తెరుచుకోవడంపై అనిశ్చితి నెలకొంది. దీనికితోడు బాబ్ అల్-మండేబ్ జలసంధి ప్రాంతాన్ని హౌతీ తిరుగుబాటుదారులు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారన్న వార్తలు, సౌదీ అరేబియా చమురు పైప్‌లైన్ మూసివేత పరిస్థితులను మరింత దిగజార్చాయి. ఈ పరిణామాల దెబ్బకు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు ఏకంగా $108 వద్దకు చేరింది. డబ్ల్యూటీఐ బ్యారెల్ ధర $104 స్థాయికి ఎగబాకింది. మర్బన్ ముడి చమురు దాదాపు $120 వద్ద ట్రేడ్ అవుతోంది. చమురు ధరల అమాంతం పెరగడం వల్ల దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే ఆసియా దేశాల్లో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) భయాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇవి స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. భారత మార్కెట్లు మంగళవారం తిరిగి స్టార్ట్ కానున్న నేపథ్యంలో.. ఈ క్రూడ్ సెగలు దేశీయ ఇన్వెస్టర్లను ఎంతవరకు కలవరపెడతాయో చూడాల్సి ఉంది.