భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) దేశీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, భద్రతను పెంచేందుకు ‘పేమెంట్స్ విజన్ 2028’ (Payments Vision 2028) పేరుతో ఒక కీలక రోడ్మ్యాప్ను విడుదల చేసింది. రాబోయే కాలంలో మనం డబ్బులు పంపే విధానంలో రానున్న మార్పులు, కొత్తగా రాబోయే టెక్నాలజీలు, వినియోగదారుల రక్షణ కోసం ఆర్బీఐ తీసుకోబోయే చర్యలను ఈ డాక్యుమెంట్లో వివరించింది.
ప్రస్తుతం మనం వాడుతున్న కాగితపు చెక్కులకు ఉన్న నమ్మకాన్ని, డిజిటల్ లావాదేవీలకు ఉన్న వేగాన్ని కలిపి ‘ఈ-చెక్కులను’ తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తోంది. అంటే భౌతికంగా చెక్కులు రాసి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. డిజిటల్ రూపంలోనే సురక్షితంగా చెక్కులను జారీ చేసే విధానాన్ని ఆర్బీఐ పరిశీలిస్తోంది.
ఈ-కామర్స్ సైట్లపై నిఘా..
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు.. ఇతర డిజిటల్ ప్లాట్ఫారమ్లు ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటి ద్వారా వేల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. అందుకే, ఈ సంస్థలను కూడా ఆర్బీఐ తన ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకురావాలని భావిస్తోంది. దీనివల్ల వినియోగదారుల డేటా భద్రత, లావాదేవీల క్రమబద్ధత పెరుగుతుంది.
మోసాలు జరిగితే ‘ఉమ్మడి బాధ్యత’..
ఆన్లైన్ మోసాల వల్ల ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే, ఇప్పటివరకు బాధ్యత ఎవరిది అనే విషయంలో స్పష్టత తక్కువగా ఉండేది. దీనిని పరిష్కరించడానికి ఆర్బీఐ ‘షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్వర్క్’ను తీసుకురానుంది. దీని ప్రకారం.. డబ్బులు పంపిన బ్యాంకు, డబ్బులు అందుకున్న బ్యాంకు రెండూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది బ్యాంకులు మరింత జాగ్రత్తగా ఉండటానికి.. మోసాలను అరికట్టడానికి దోహదపడుతుంది.
Also Read:Ground War On: ఇరాన్తో యుద్ధం.. 57,000 మంది అమెరికా సైనికుల మొహరింపు..
వినియోగదారులకు మరింత నియంత్రణ..
మనం డెబిట్/క్రెడిట్ కార్డులను ఎలాగైతే మనమే ఆన్ లేదా ఆఫ్ చేసుకోగలమో (Enable/Disable), భవిష్యత్తులో ఇతర డిజిటల్ పేమెంట్ మోడ్స్ (UPI వంటివి) పట్ల కూడా వినియోగదారులకు అటువంటి నియంత్రణను ఇవ్వాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. అంటే మీకు అవసరం లేనప్పుడు కొన్ని రకాల చెల్లింపులను మీరే నిలిపివేసుకోవచ్చు.
ఇతర మార్పులు..
లావాదేవీలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో స్పష్టంగా తెలుసుకోవడానికి ‘డొమెస్టిక్ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్’ (DLEI) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. బ్యాంకింగ్ ఏతర పేమెంట్ సంస్థల కోసం ‘సైబర్ కీ రిస్క్ ఇండికేటర్స్’ (KRI) ఫ్రేమ్వర్క్ను రూపొందిస్తున్నారు. ఆధార్ ద్వారా జరిగే చెల్లింపుల్లో మరిన్ని కొత్త సౌకర్యాలను (White-label solutions) తీసుకురానున్నారు. విదేశాలకు డబ్బు పంపడం లేదా అక్కడ నుంచి డబ్బులు అందుకోవడాన్ని మరింత సులభతరం చేసి, ఖర్చులను తగ్గించాలని ఆర్బీఐ నిర్ణయించింది.
మొత్తానికి.. ఆర్బీఐ ‘పేమెంట్స్ విజన్ 2028’ లక్ష్యం ఏమిటంటే.. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు మరింత సురక్షితంగా, పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉండటం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వచ్చే సైబర్ ముప్పుల నుంచి సామాన్యుడిని రక్షించడమే ఈ కొత్త విధానాల ప్రధాన ఉద్దేశం.