బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఏ మూల చూసినా బంగారం అంటే అంతటి వ్యామోహం, పెట్టుబడి పట్ల అంతటి నమ్మకం ఉంటుంది. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఊహించని పరిణామాలు బంగారం మార్కెట్లో వింత పరిస్థితులను సృష్టించాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో చెలరేగిన యుద్ధం, బంగారం వ్యాపార కేంద్రమైన దుబాయ్లో ఊహించని మార్పులకు దారితీసింది.
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. దుబాయ్లో మాత్రం బంగారంపై భారీగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడం, రవాణా వ్యవస్థ స్తంభించడంతో ఈ విచిత్ర పరిస్థితి నెలకొంది. తమ వద్ద ఉన్న బంగారాన్ని నిల్వ ఉంచుకోవడానికి అయ్యే ఖర్చులు భరించలేక వ్యాపారులు తక్కువ ధరకే అమ్మేయడానికి సిద్ధమయ్యారు. లండన్ మార్కెట్ ధర కంటే ఔన్సుపై 30 డాలర్ల వరకు తగ్గింపు ఇస్తున్నారని సమాచారం.
Also Read:Blue Sparrow: ఇరాన్ సుప్రీం లీడర్ మరణానికి కారణం ‘బ్లూ స్పారో క్షిపణి’.. దీని ప్రత్యేకత ఇదే..
ఎగుమతులు నిలిచిపోవడానికి కారణాలు ఇవే..
దుబాయ్ అంటే ఆసియా, ఆఫ్రికా దేశాలకు బంగారాన్ని శుద్ధి చేసి పంపే ఒక పెద్ద కేంద్రం. అయితే.. ఇరాన్ క్షిపణి దాడుల భయంతో యూఏఈలో ఏ ఒక్క విమానం కూడా ఎగరడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం అక్కడ విమాన సర్వీసులను పాక్షికంగా మూసివేశారు. దీంతో బులియన్ ఎగుమతులు ఆగిపోయాయి. బంగారాన్ని తరలించడానికి ప్రయాణికుల విమానాలే ప్రధాన ఆధారం.. అవి ఇప్పుడు అందుబాటులో లేవు. రోడ్డు మార్గం ద్వారా సౌదీ అరేబియా, ఒమన్ వంటి దేశాల మీదుగా తరలించే అవకాశం ఉన్నా.. సరిహద్దుల్లోని భద్రతా పరమైన ఇబ్బందులు, ఇన్సూరెన్స్ సమస్యలు, భారీ రవాణా ఖర్చుల వల్ల వ్యాపారులు ఆ రిస్క్ తీసుకోవడం లేదు. యుద్ధం మొదలైనప్పటి నుంచి రవాణా ఖర్చులు ఏకంగా 60 శాతం నుంచి 70 శాతం వరకు పెరిగాయి.
Also Read:Gold Rates: శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..
భారత్ తన గోల్డ్ అవసరాల కోసం దుబాయ్పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. రవాణా నిలిచిపోవడంతో భారత్లో బంగారం సప్లై కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే.. జనవరిలోనే మనం భారీగా బంగారం దిగుమతి చేసుకోవడం వల్ల ప్రస్తుతం మన దగ్గర తగినంత నిల్వలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ.. ఈ యుద్ధం ఇలాగే మరికొన్ని నెలలు కొనసాగితే మాత్రం బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది.
Also Read:Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!
అంతర్జాతీయంగా బంగారం ధరలు ఈ ఏడాది ఇప్పటికే 20 శాతం పెరిగి.. ఔన్సు 5,000 డాలర్ల పైకి చేరాయి. యుద్ధ ఉద్రిక్తతలు, డాలర్ విలువ పెరగడం వల్ల మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. ముడి బంగారం అందక ఎంఎమ్టిసి-ప్యాంప్ వంటి పెద్ద రిఫైనరీ సంస్థలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. దుబాయ్లో కనిపిస్తున్న ఈ ధరల తగ్గింపు అనేది రవాణా సమస్యల వల్ల వచ్చిన తాత్కాలిక పరిస్థితి మాత్రమేనని.. ఇది పెట్టుబడిదారులకు ఒక వింత అనుభూతిని ఇస్తోందని నిపుణులు వివరిస్తున్నారు.