ఖతార్కు చెందిన ప్రముఖ బ్యాంకు ‘దోహా బ్యాంక్’ (Doha Bank) భారత్లో తన కార్యకలాపాలను తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. పదేళ్లకు పైగా మన దేశంలో సేవలు అందించిన ఈ బ్యాంకు, ఇప్పుడు తన రెండు శాఖలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దోహా బ్యాంకు తన వ్యాపార విధానంలో మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా భారత్లో ఉన్న తన పూర్తి స్థాయి బ్యాంకు శాఖలను మూసివేసి.. కేవలం ఒక ‘ప్రతినిధి కార్యాలయం’ (Representative Office)ను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఖతార్లోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్నారు. దీనికి సంబంధించి స్థానిక స్టాక్ ఎక్స్ఛేంజీకి కూడా సమాచారం అందించారు.
నిబంధనల ప్రకారం ఉపసంహరణ..
భారతదేశంలోని బ్యాంకు కార్యకలాపాల నుంచి క్రమంగా తప్పుకోవడానికి బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే.. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వంటి సంబంధిత ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ అనుమతులు వచ్చిన తర్వాతే శాఖల మూసివేత ప్రక్రియ పూర్తవుతుంది.
భారత్లో దోహా బ్యాంక్ ప్రస్థానం..
దోహా బ్యాంక్ జూన్ 2014లో భారతదేశంలో తన సేవలను ప్రారంభించింది. మొదట ముంబైలో తన మొదటి శాఖను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కేరళలోని కొచ్చిలో మరొక శాఖను తెరిచింది. గల్ఫ్ దేశాలకు, భారత్కు మధ్య జరిగే నగదు బదిలీలు, పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థను ఆసరాగా చేసుకుని తన వ్యాపారాన్ని విస్తరించాలని అప్పట్లో ఈ బ్యాంకు భావించింది.
2016 ప్రాంతంలో ఈ బ్యాంకు భారత్లో ఒక అనుబంధ సంస్థను (Subsidiary) ఏర్పాటు చేయడానికి అనుమతి కోరుతుందని వార్తలు వచ్చాయి. కానీ.. ఇప్పుడు అనూహ్యంగా తన శాఖలను మూసివేసి కేవలం ప్రతినిధి కార్యాలయానికే పరిమితం కావడం గమనార్హం.
ప్రతినిధి కార్యాలయం అంటే ఏమిటి..?
ప్రతినిధి కార్యాలయం అనేది నేరుగా బ్యాంకింగ్ లావాదేవీలు (డబ్బులు జమ చేయడం, విత్ డ్రా చేయడం వంటివి) చేయదు. ఇది కేవలం ఖతార్లోని ప్రధాన బ్యాంకుకు, భారతీయ కస్టమర్లకు మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది. వ్యాపార అవకాశాలను వెతకడం, సమాచారాన్ని పంచుకోవడం వంటి పనులకు మాత్రమే ఇది పరిమితం అవుతుంది.