దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త వెల్లడించింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా భారతదేశానికి ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశానికి ఎరువులు, ముడి పదార్థాలను తీసుకొస్తున్న 20 నౌకల్లో ఇప్పటికే 15 నౌకలు హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు తెలిపింది.
యూరియా, డీఏపీతో భారీ సరుకు భారతదేశానికి
మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, సురక్షితంగా ప్రయాణించిన 15 నౌకల్లో 8 నౌకలు- 3.32 లక్షల టన్నుల యూరియా, 4 నౌకలు- 2.57 లక్షల టన్నుల డీఏపీ (DAP), 3 నౌకలు- 1.11 లక్షల టన్నుల సల్ఫర్ తీసుకువస్తున్నాయి. ఈ సరుకు అంతా నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే భారత ఓడరేవులకు చేరుకుంటోందని అధికారులు వెల్లడించారు.
మరో ఐదు నౌకలు కూడా రానున్నాయి
ఇంకా ఐదు నౌకలు భారతదేశానికి చేరనున్నాయని కేంద్రం తెలిపింది. వాటిలో ఒక నౌక 0.25 లక్షల టన్నుల అమ్మోనియా, మరో నౌక 0.45 లక్షల టన్నుల యూరియాను తీసుకువస్తోంది. అదనంగా మరో రెండు యూరియా నౌకలు, ఒక సల్ఫర్ నౌకలో లోడింగ్ ప్రక్రియ కొనసాగుతోందని, ఇవన్నీ కూడా ప్రణాళిక ప్రకారమే భారతదేశానికి చేరుతాయని అధికారులు పేర్కొన్నారు.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం లేదు
హార్ముజ్ జలసంధి గుండా సముద్ర రవాణాపై మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ప్రభావం చూపినప్పటికీ, ముందస్తు ప్రణాళిక, సమర్థవంతమైన సమన్వయం, నిరంతర పర్యవేక్షణ వల్ల ఎరువుల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నామని కేంద్రం వెల్లడించింది. అలాగే దౌత్యపరమైన చర్చల ద్వారా కొత్త సరఫరా వనరులను కూడా సమకూర్చుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
పలు దేశాల నుంచి యూరియా దిగుమతులు
భారతదేశం యూరియా సరఫరా కోసం పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. వీటిలో:
ఒమన్
మలేషియా
వియత్నాం
జార్జియా
నైజీరియా
రష్యా
ఫిన్లాండ్
ఈజిప్ట్
అల్జీరియా
టర్కీ
నెదర్లాండ్స్ దేశాలు ఉన్నాయి. అలాగే డీఏపీ, ఎన్పీకే ఎరువుల కోసం రష్యా, మొరాకో, ఈజిప్ట్, అమెరికా, జోర్డాన్, దక్షిణ కొరియా, ట్యునీషియా, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి ఎర్ర సముద్ర మార్గం ద్వారా సరఫరా కొనసాగుతోంది.
దేశీయ ఉత్పత్తిలోనూ పెరుగుదల
2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ యూరియా ఉత్పత్తి లక్ష్యాన్ని మించి నమోదైంది.
లక్ష్యం: 67.86 లక్షల టన్నులు
ఉత్పత్తి: 71.55 లక్షల టన్నులు
అదే విధంగా:
డీఏపీ ఉత్పత్తి: 9.84 లక్షల టన్నులు
ఎన్పీకే ఉత్పత్తి: 20.77 లక్షల టన్నులు
ఎస్ఎస్పీ ఉత్పత్తి: 13.50 లక్షల టన్నులుగా నమోదయ్యాయి.
దేశంలో ఎరువుల నిల్వలు పుష్కలంగా
దేశ వార్షిక ఎరువుల అవసరం 383.9 లక్షల టన్నులు కాగా, ఇప్పటికే 197.56 లక్షల టన్నుల నిల్వలు సమకూర్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఇది వార్షిక అవసరంలో 51 శాతానికి పైగా.
జూలై 2 నాటికి దేశంలో ఉన్న ఎరువుల నిల్వలు ఇలా ఉన్నాయి:
యూరియా – 69.08 లక్షల టన్నులు
డీఏపీ – 16.64 లక్షల టన్నులు
మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (MOP) – 8.90 లక్షల టన్నులు
ఎన్పీకే – 45.64 లక్షల టన్నులు
ఎస్ఎస్పీ – 23.09 లక్షల టన్నులు
మొత్తంగా దేశంలో 163.35 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.
రైతులకు కేంద్రం భరోసా
దిగుమతుల వైవిధ్యీకరణ, దేశీయ ఉత్పత్తి పెంపు, తగిన నిల్వల నిర్వహణ వల్ల దేశవ్యాప్తంగా ఎరువుల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందేలా అన్ని చర్యలు కొనసాగిస్తున్నామని, వ్యవసాయ రంగానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.

