బిగ్ బాస్ సీజన్ 5 మూడో రోజునే చప్పగా అయిపోయింది. ఈ రోజుకు సంబంధించిన షో… ఎలాంటి ఉత్సాహం వ్యూవర్స్ లో కల్పించలేకపోయింది. మరీ ముఖ్యంగా డే ప్రారంభం నుండి ముగింపు వరకూ వ్యూవర్స్ సహనాన్ని పరీక్ష పెట్టింది. పవర్ రూమ్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మానస్… కంటెస్టెంట్స్ అందరూ నిద్రపోయిన తర్వాతే ఆర్జే కాజల్ నిద్రపోవాలని చెప్పాడు. అయితే దాని వెనుక ఏదో సీక్రెట్ టాస్క్ దాగి ఉందనే అనుమానంతో మెజారిటీ సభ్యులు నిద్ర వచ్చినా… ఆపుకుని… జాగారం చేశారు. దాంతో ఆర్జే కాజల్ కూడా నిద్రలేకుండా గడిపేసింది. ఒకటి రెండు సార్లు నిద్రపోవడంతో బజర్ మ్రోగి అందరికీ నిద్రా భంగమైంది.
చిత్రం ఏమంటే… బజర్ కు, మెరుపుల సౌండ్ కి తేడా గుర్తించకుండా కొందరు కంటెస్టెంట్స్ అది పవన్ రూమ్ హింట్ గా భావించి, ఉరుకులు పరుగులతో బల్బ్ మీద చేతులు పెట్టేశారు. అందులో ఒకటికి రెండు సార్లు భంగ పడింది డాన్స్ మాస్టర్ నటరాజ్. అయితే… విశ్వ, మానస్ తర్వాత పవర్ రూమ్ విజేతగా సిరి గెలవడం విశేషం. దాంతో కంటెస్టెంట్స్ నుండి ఒకరిని యజమానిగా, మరొకరిని సర్వెంట్ గా ఎంచుకోమని బిగ్ బాస్ చెప్పాడు. సహజంగానే షణ్ముఖ్ అంటే అభిమానం ఉన్న సిరి అతన్ని యజమానిగా, లోబోను సర్వెంట్ గా ఎంపిక చేసింది. ఈ టాస్క్ ను సైతం వారు కామెడీగా తీసుకోవడంతో బిగ్ బాస్ హెచ్చరికకు సిరి గురైంది. ఈ కథ ఇలా ఉంటే… మంగళవారం చనిపోయిన తన తమ్ముడిని తలుచుకుని విశ్వ కన్నీరు మున్నీరు కాగా, బుధవారం ఆ ఛాన్స్ ప్రియకు దక్కింది. క్యాన్సర్ తో చనిపోయిన తన కూతురును తలుచుకుని ప్రియా తల్లి మనసు తల్లడిల్లిపోయింది.
ఇక బిగ్ బాస్ మొదటి రోజున హమీదా… లహరిని నామినేట్ చేయగా, లహరి తన వంతు రాగానే హమీదాను నామినేట్ చేసింది. రెండో రోజు ఆర్జే కాజల్ తో గొడవపడిన లహరి… మూడో రోజు తన దృష్టిని హమీదా మీద పెట్టింది. తమ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి కూర్చున్న వీరిద్దరూ ఆ తర్వాత ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుని కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది. అయితే… ఆ తర్వాత కొద్ది గంటలకే వీరిద్దరూ కూల్ అయ్యి, ఒకరిని ఒకరు గట్టిగా హగ్ చేసుకుని కలిసిపోయారు. అయితే… లహరి – హమీదా కథ ఇటు సుఖాంతం అయ్యిందో లేదో ఉమాదేవి, యానీ మధ్య వంట విషయంలో పెద్ద రచ్చ జరిగింది. తను అడిగితే కూర లేదని చెప్పిన వారు… ఆ తర్వాత వారి కోసం కూర ఎలా ఇచ్చారని, వేరొకరి కోసం ఫ్రిజ్ లో కూరలు ఎలా దాస్తారంటూ ఉమాదేవి… యానీ మాస్టర్ తో గట్టిగానే గొడవ పడింది. యానీ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా, ఉమాదేవి వినకపోవడం విడ్డూరంగా ఉంది. ఇదేదో పులిహోర కలుపుతున్నట్టుగా అనిపిస్తోంది. మొత్తం మీద మూడో రోజు వినోదం తక్కువ విషాదం ఎక్కువ అన్నట్టుగా సాగింది. అయితే… మూడు రోజుల తర్వాత సింగర్ రామచంద్ర కాస్తంత ఫోకస్ లోకి వచ్చాడు. నిన్న తన యాటిట్యూడ్ తో రచ్చ చేసిన జస్వంత్ ఇవాళ అసలు అడ్రస్ లేకుండా పోయాడు. ఓవర్ ఆల్ గా ఈ రోజు ఆకట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే… అది లోబో నే! బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ కొందరిని లోబో చక్కగా అనుకరించి మంచి మార్కులు కొట్టేశాడు!