Site icon NTV Telugu

Maha Shivaratri: నేడే మహా శివరాత్రి.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..

Shivalayams

Shivalayams

Maha Shivaratri: మహా శివరాత్రిని పురస్కరించుకుని ఆంధ్ర, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. నేడు తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, పరమశివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాలు ‘ఓం నమఃశివాయ’ నామస్మరణతో మార్మోగిపోతున్నాయి.

Read Also: PM Modi: కాంగ్రెస్ ‘‘మావోయిస్ట్ – ముస్లిం లీగ్’’ పార్టీ..

శ్రీశైల క్షేత్రంలో తెల్లవారుజాము నుంచే భారీగా భక్తులు దర్శనానికి వస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినం కావడంతో భక్తుల శివనామ స్మరణతో శ్రీశైలం మారుమ్రోగిపోతుంది. భక్తితో దీపాలను వెలిగించి, తాము కోరుకున్న కోరికలు తీరాలని ఆ శివయ్యకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా శివమాలతో దర్శనానికి వస్తున్నామని శివ స్వాములు పేర్కొంటున్నారు. బొందితో స్వర్గానికి వెళతారనే నమ్మకం ఒకటైతే, ఏ కోరికతో మహా శివరాత్రి నాడు దర్శనం చేసుకుంటామో.. ఆ కోరిక కచ్చితంగా నెరవేరుతుంది అని శివ భక్తులు చెబుతున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామి వారిని దర్శించుకుని భక్తులు కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక, ఆలయం మొత్తం శివ నామస్మరణలతో మార్మోగుతుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం శంకర మఠంలో అనువంశిక అర్చకులచే మహా లింగార్చన ఉండనుంది. రాత్రి లింగోద్భవం సమయంలో శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయనున్నారు అర్చకులు.

Read Also: PM Modi: బంగ్లా నుంచి ప్రధాని మోడీకి ఆహ్వానం.. వెళ్లే అవకాశాలు తక్కువే..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో మహశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేకువ జాము నుంచే సుదూర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి కాళేశ్వరం చేరుకుంటున్నారు. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత నదిమాతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. గర్భాలయంలో స్వామివారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

అలాగే, పల్నాడు జిల్లాలోని కోటప్పకొండకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల వాహనాలతో కొండకు వచ్చే రోడ్లు రద్దీగా మారాయి. కోటప్పకొండ ఆలయం భక్తులతో నిండిపోయింది. త్రికోటేశ్వరుడి దర్శనానికి‌ క్యూ లైన్లలో భారీగా భక్తులు.. ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా వాహనాల రాకపోకలను నిమంత్రిస్తున్న పోలీసులు.. కొండ కింద వాహనాలు పార్క్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. కోటప్ప కొండపైకి భక్తులు వెళ్లేందుకు 120 ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు.

Read Also: Advocate Swapna Murder Case: పక్కా స్కెచ్‌తో చెల్లిని అంతమొందించిన అన్న!

శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి ఉత్సవాలు మొదలైయ్యాయి. సర్వాంగ సుందరంగా అధికారులు ఆలయాన్ని ముస్తాబు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. రాత్రికి స్వామివారికి నంది వాహన సేవ కొనసాగునుంది. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అర్ధరాత్రి జరిగే లింగోద్భవ అభిషేకం వరకు భక్తులను మహాలఘు దర్శనానికి అనుమతించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇక, పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో గల పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచి ఉదయం 3:30 గంటలకు ప్రారంభమైంది. ఆ పరమేశ్వరుడిని దర్శించుకోవడానికి క్యూలైన్ లలో భక్తులు బారులు తీరారు. ఇక, మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు లింగోద్భవం వరకు ఏకధాటిగా అభిషేకాలు కొనసాగనున్నాయి. లింగోద్భవం సమయంలో స్వామివారి అంతరాలయం నుంచి విమాన గోపురం వరకు పాగా సమర్పణ కార్యక్రమం ఉండనుంది.

ఓం నమశ్శివాయ.. ఓం శివాయ నమః అంటూ భక్తుల నామస్మరణతో అమరేశ్వరస్వామి ఆలయం మారుమోగిపోతోంది.. మహా శివరాత్రి సందర్భంగా అమరావతిలోని శ్రీ అమరేశ్వరస్వామి, శ్రీ బాల చాముండిక సమేత అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.. తెల్లవారుజాము నుంచే భక్తులకు దర్శనాలు ప్రారంభం కాగా, రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారికి అభిషేకాలు ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి.

Exit mobile version