Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మొదట ఆశ్చర్యపోయే విషయం దాని నిర్మాణం. సాధారణంగా ఆలయాలను రాయి రాయిగా పేర్చి నిర్మిస్తారు. కానీ మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాసనాథ ఆలయాన్ని మాత్రం ఒకే భారీ కొండరాయిని పై నుంచి కిందికి చెక్కి రూపొందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా ఆలయాల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. అందుకే దీనిని భారతీయ శిల్పకళలో అత్యంత గొప్ప అద్భుతాల్లో ఒకటిగా భావిస్తారు.
చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయాన్ని రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుడు ఎనిమిదో శతాబ్దంలో నిర్మించించాడు. శివుడి కైలాస పర్వతాన్ని భూమిపై ప్రతిబింబించేలా ఈ ఆలయాన్ని రూపొందించినట్లు భావిస్తారు. ఆలయ నిర్మాణంలో ముందుగా కొండపై భాగాన్ని గుర్తించి అక్కడి నుంచి క్రమంగా రాయిని తొలగిస్తూ కిందివైపు చెక్కారు. ఈ విధానం వల్ల నిర్మాణంలో పొరపాట్లకు చాలా తక్కువ అవకాశం ఉండేది. ఒకసారి రాయిని తొలగిస్తే తిరిగి అమర్చడం సాధ్యం కాకపోవడంతో ప్రతి అడుగులోనూ అత్యంత ఖచ్చితత్వం అవసరమైంది.
ఈ ఆలయంలో గర్భగుడి, మండపాలు, శిల్పాలు, స్తంభాలు, ఏనుగుల విగ్రహాలు అన్నీ ఒకే రాతిలో నుంచి చెక్కబడ్డాయి. పరిశోధకుల అంచనా ప్రకారం లక్షల టన్నుల రాయిని తొలగించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆధునిక యంత్రాలు లేని కాలంలో ఇంత భారీ నిర్మాణాన్ని ఎలా పూర్తి చేశారన్నది ఇప్పటికీ ఇంజినీర్లను ఆశ్చర్యపరుస్తోంది.
ఎల్లోరా గుహలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు సంపాదించాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శించి భారతీయ శిల్పుల ప్రతిభను ప్రత్యక్షంగా చూస్తుంటారు. కైలాసనాథ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, భారతీయ ఇంజినీరింగ్ నైపుణ్యం, కళాత్మకత, దూరదృష్టికి చిరస్థాయి గుర్తుగా నిలిచింది.

