NTV Telugu Site icon

Operation Ganga: ప్రధాని మోడీ కీలక భేటీ.. ఉక్రెయిన్ బోర్డర్ దేశాల‌కు కేంద్ర మంత్రులు..

ఉక్రెయిన్‌-రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఓవైపు చర్చలు.. మరో వైపు యుద్ధం ఇలా.. రెండూ సాగుతున్నాయి.. మరోవైపు ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం.. ఉక్రెయిన్‌లో ఇంకా 15 వేల మంది భారతీయులు చిక్కుకున్నారు.. వారంతా ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు తరలివస్తున్నారు.. దాడులు జరుగుతుండడంతో భయపడిపోతున్నారు.. పోలండ్‌లో భారతీయులపై అక్కడి స్థానిక పోలీసులు దాడులు చేశారు.. దీంతో ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు మంత్రులను పంపాలని భావిస్తోంది కేంద్రం. ఉక్రెయిన్ సంక్షోభంపై ఇవాళ ఉన్నత స్థాయి అత్యవసర స‌మావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరి, స్లోవక్ రిప‌బ్లిక్‌, పోలాండ్‌కు కేంద్ర మంత్రులను పంపించాలని నిర్ణయం తీసుకున్నారు.

Read Also: YS Viveka Murder Case: సీబీఐ వాంగ్మూలం.. సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

రొమేనియా, హంగేరి, స్లోవక్ రిప‌బ్లిక్‌, పోలాండ్‌కు కేంద్ర మంత్రులు హ‌రిదీప్ సింగ్ పురి, జ్యోతిరాదిత్య సింథియా, కిర‌ణ్ రిజిజు, వీకే సింగ్‌ను పంపించనుంది కేంద్ర ప్రభుత్వం.. ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఆపరేషన్‌ గంగాను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం.. భార‌తీయ విద్యార్థుల‌ను తీసుకువచ్చే కార్యక్రమాలను వేగవంతం చేసింది.. కాగా, ఉక్రెయిన్‌లో ఇంకా దాదాపు 15వేల మంది భార‌తీయ విద్యార్థులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బంక‌ర్లు, బాంబు షెల్టర్లు, హాస్టల్ బేస్‌మెంట్ల‌లో వాళ్లంతా త‌ల‌దాచుకుంటున్నారు. గ‌త గురువారం ర‌ష్యా దాడులు ప్రారంభించ‌డానికి ముందు కొంత మంది విద్యార్థులు ఉక్రెయిన్ వీడి వ‌చ్చారు. ఇక, అక్కడ చిక్కుకున్నవారి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.. ఇప్పటికే ఐదు విమానాలు భారత్‌కు చేరుకున్నాయి.. అక్కడి నుంచి సొంత రాష్ట్రాలకు విద్యార్థులను తరలించే ప్రక్రియను చేపట్టాయి ఆయా రాష్ట్రాలు.