విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఆదివారం నాడు జుంబా డే నిర్వహించారు. తేజాస్ ఎలైట్ సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో హీరో సంపూర్ణేష్ బాబు, వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతను జుంబా డ్యాన్స్ పట్ల ప్రోత్సహించేందుకు హీరో సంపూర్ణేష్తో కలిసి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ జుంబా డ్యాన్స్ చేశారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను వైసీపీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఇలాంటి ఫిట్ నెస్ ఈవెంట్లు మరిన్ని నిర్వహించాలని, జుంబా డ్యాన్స్ వంటి ఫిట్నెస్ ఎక్సర్ సైజులను యువత క్రమం తప్పకుండా చేయాలని ఎమ్మెల్యే జోగి రమేష్ పిలుపునిచ్చారు.
అంతకుముందు ఇబ్రహీంపట్నంలో జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ కప్ క్రికెట్ పోటీలను సినీ హీరో సంపూర్ణేష్ బాబు ప్రారంభించారు. అనంతరం తొలి మ్యాచ్ మైలవరం జర్నలిస్టులు, ఇబ్రహీంపట్నం పోలీస్ టీముల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పోలీస్ టీం ఘన విజయం సాధించింది. ఈనెల 4న బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.