Weather Alert: ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాబోయే 48 గంటల్లో పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన చెప్పుకొచ్చారు. దీని ప్రభావంతో ఏపీవ్యాప్తంగా బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Read Also: Adina mosque: ఆదినా మసీదా లేదా ఆదినాథ్ ఆలయమా.? యూసఫ్ పఠాన్ వివాదం..
ఇక, అక్టోబర్ 19న తేదీన శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలిక పాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక, ఈరోజు (అక్టోబర్ 18న) సాయంత్రం 5 గంటలకు విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో 49.7 మిల్లి మీటర్ల, కృష్ణా జిల్లా ఘంటసాలలో 44.7మిల్లి మీటర్ల, తిరుపతి జిల్లా 27.7మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు.