Nara Lokesh: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. ‘ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్‌పోర్టు వచ్చింది’

Lokesh

Lokesh

Nara Lokesh: ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కలలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెక్కలు ఇచ్చారని రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ అన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన పవిత్ర నేలపై నిర్మించిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పవర్ ఇంజిన్‌లా మారబోతోందని లోకేశ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలిచి, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు కొత్త ఊపునిస్తుందని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని లోకేశ్ తెలిపారు. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ విమానాశ్రయం ద్వారా మరింత అభివృద్ధి చెందడంతో పాటు, ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు కూడా గణనీయంగా తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పుడు “ఎర్రబస్సు కూడా రాదన్న ప్రాంతంలో” నేడు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మితమైందని, అదే వేదికపై ప్రధాని మోదీ హాజరుకావడం ఉత్తరాంధ్ర ప్రజలకు గర్వకారణమని లోకేష్‌ అన్నారు. కేవలం రికార్డు సమయంలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేసిన జీఎంఆర్ సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలిపారు మంత్రి నారా లోకేష్‌..