Indian Crew Tanker Incident: పశ్చిమ ఆసియాలోని హార్మూజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు భారతీయ నావికుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. గత మూడు రోజుల వ్యవధిలో భారతీయ సిబ్బంది ఉన్న మూడు నౌకలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకోవడంతో పరిస్థితి మరింత చర్చనీయాంశంగా మారింది. కొన్ని నివేదికల ప్రకారం, ఈ ఘటనల్లో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు.. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు భారతీయుల్లో విశాఖపట్నం వాసి కూడా ఉన్నట్లు ఢిల్లీలోని ఆంధ్రా భవన్ అధికారులు ధ్రువీకరించారు. మృతుడిని 44 ఏళ్ల మెరైన్ ఇంజినీర్ సురేష్ పట్నాలగా గుర్తించారు. జూన్ 24న ఆయన వివాహ 15వ వార్షికోత్సవం ఉందని.. అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సురేష్కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆయన మృతితో విశాఖలో విషాదం నెలకొంది..
అయితే, జూన్ 8న ఒమన్ ఆగ్నేయ తీర ప్రాంతంలో ‘మారివెక్స్’ అనే ట్యాంకర్కు సంబంధించిన సంఘటన చోటుచేసుకుంది. అమెరికా ఆంక్షలకు లోబడి ఉన్న ఈ నౌకపై చర్యలు తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ఈ నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అనంతరం జూన్ 9-10 తేదీల్లో ఒమన్ తీర ప్రాంతంలో ‘ఎంటీ సెట్టెబెల్లో’ అనే చమురు ట్యాంకర్కు సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా, వారిలో 21 మందిని సురక్షితంగా రక్షించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత ప్రభుత్వం ధృవీకరించింది.. ఇక జూన్ 11న ‘ఎంటీ జల్వీర్’ అనే నౌకకు సంబంధించిన మరో సముద్ర భద్రతా ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నౌకలో 21 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, రాయబార కార్యాలయం సమాచారం ప్రకారం, సిబ్బంది అందరినీ సురక్షితంగా తరలించే చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని నివేదికలు సూచిస్తున్నాయి.

