Vizag Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నాసిరకం రా మెటీరియల్ వినియోగానికి సంబంధించిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్లాంట్లో ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలు దెబ్బతినడానికి నాసిరకం ముడి పదార్థాలే ప్రధాన కారణమని ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్వాలిటీ పరీక్షల నిర్వహణలో అధికారులు రాజీపడ్డారనే ఆరోపణలపై యాజమాన్యం కీలక చర్యలు చేపట్టింది. ఒకేసారి 22 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య స్టీల్ ప్లాంట్ వర్గాల్లో సంచలనంగా మారింది.
సస్పెన్షన్కు గురైన వారిలో SMS-1, SMS-2 విభాగాలతో పాటు క్యూఏటీడీ (Quality Assurance Technology Department)లో పనిచేస్తున్న సీనియర్ అధికారులు ఉన్నట్లు సమాచారం. నాణ్యత నియంత్రణలో జరిగిన లోపాలపై యాజమాన్యం తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదే వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు జనరల్ మేనేజర్లు (GMలు), నలుగురు డిప్యూటీ జనరల్ మేనేజర్లు (DGMలు) బదిలీకి గురయ్యారు. బాధ్యత నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని చర్యలు ఉండే అవకాశం ఉందని సమాచారం.
అయితే రా మెటీరియల్ కొనుగోలు, నాణ్యత తనిఖీలు, ఉత్పత్తి ప్రక్రియలో జరిగిన లోపాలపై సమగ్ర విచారణ జరపాలని ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సీటు (SIT)తో విచారణ చేపట్టాలని కోరుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతిష్ఠకు సంబంధించిన ఈ అంశంలో పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

