Site icon NTV Telugu

Rithu Sahu Case: రీతు సాహు కేసులో కొత్త ట్విస్ట్..! సీబీఐ ఎంట్రీతో..

Rithu Sahu Case

Rithu Sahu Case

Rithu Sahu Case: బెంగాల్‌ విద్యార్థిని రీతు సాహు మృతి కేసు విశాఖ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.. కేవలం పోలీసులకే కాదు, విచారణ కమిటీ అధికారులు, కాలేజీ యాజమాన్యం, హాస్టల్ నిర్వాహకులు పాత్రపై నిగ్గు తేల్చాలి.. మొదట పోలీసులు, తర్వాత హైకోర్టు, ఇప్పుడు సీబీఐకి విద్యార్థిని కేసు అప్పగించాలంటూ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. అది 2023 జూలై 14న హాస్టల్‌ భవనం పైనుంచి పడి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.. ఏపీ పోలీసుల దర్యాఫ్తు పై నమ్మకం లేక పశ్చిమ బెంగాల్‌ సీఎం ఆదేశాల మేరకు అక్కడ కేసు నమోదు చేసారు.. తాజాగా సీబీఐకి అప్పగించడంతో కేసు కొలిక్కి ఎప్పుడు వస్తుందో ఎవరిని దోషులుగా తెలుస్తారో సస్పెన్స్ గా మారింది..

Read Also: Bharat Margani: బాలకృష్ణ మానసిక స్థితిపై అనుమానం ఉంది.. మాజీ ఎంపీ ఫైర్..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన విద్యార్థిని నీట్‌ కోచింగ్‌ కోసం 2022లో 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నరసింహనగర్‌లోని ఆకాశ్‌ బైజూస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న అచీవర్స్‌ (ఆకాశ్‌) కాలేజీలో చేరింది. బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతూ దొండపర్తిలోని ప్రైవేటుహాస్టల్‌ సాధన హాస్టల్‌లో ఉండేది. విద్యార్థిని 2023 జూలై 14వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో హాస్టల్‌ గది నుంచి టెర్రస్‌పైకి వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో కానీ ఐపాడ్‌, చెప్పులతోపాటు కొన్ని దుస్తులను టెర్రస్‌ గోడపై ఉంచి కిందకు పడిపోయింది. అయితే రాత్రి 12.40 గంటల సమయంలో విద్యార్థిని కిందపడి పోయినట్టు హాస్టల్‌ వార్డెన్‌ సూర్యకుమారి, వాచ్‌మన్‌గా ఉన్న ఆమె భర్త గుర్తించి ఫోర్త్‌ టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థినిని సమీపంలోని వెంకటరమణ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స అందించారు..

విద్యార్థిని తల్లిదండ్రులు మరుసటిరోజు పశ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చి విద్యార్థినిని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. 17న చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీనిపై ఫోర్త్‌టౌన్‌ పోలీసులు మొదట 174 సెక్షన్‌ కింద కేసు నమోదుచేశారు.. విద్యార్థిని తల్లిదండ్రులు తమ కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తంచేస్తూ ఎవరో ఆమెను కిందకు తోసేసి ఉంటారని హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు జేశారు. హత్యాయత్నం జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో 174 సెక్షన్‌ కింద కేసు నమోదుచేసినట్టు అప్పటి సీపీ త్రివిక్రమవర్మ మీడియా ముందు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ హాస్టల్‌లోని నాలుగు సీసీ కెమెరాలతోపాటు పక్కనే ఉన్న ఓ షాప్ కు చెందిన సీసీ కెమెరాల్లో కూడా రికార్డయినందున వాటి ఆధారంగా కేసు నమోదుచేసి, దర్యాప్తు జరిపామని చెప్పారు. నగర పోలీసుల దర్యాప్తు సరిగా లేదని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రులు పశ్చిమ బెంగాల్‌ వెళ్లి అక్కడ సీఎం మమతా బెనర్జీని కలిసి ఫిర్యాదు చేయడంతో నేతాజీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో మరొక కేసు నమోదుచేసి తర్వాత పశ్చిమ బెంగాల్‌ సీఐడీకి కేసు దర్యాప్తును బదిలీ చేశారు.

దీంతో నగర పోలీసులు అప్రమత్తమై ఫోర్త్‌ టౌన్‌లో 174 సెక్షన్‌ కింద నమోదుచేసిన కేసును, హాస్టల్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం, భద్రతాచర్యల లోపం కారణంగా బాలిక మృతిచెందినట్టు గుర్తించి 304 పార్ట్‌ 2గా మార్చారు. హాస్టల్‌ వార్డెన్‌, వాచ్‌మన్‌తోపాటు ఆకాష్‌ బైజూస్‌ సంస్థకు చెందిన ఇద్దరు మేనేజర్లను నిందితులుగా చేర్చి, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు విషయమై పశ్చిమ బెంగాల్‌ సీఐడీ పోలీసులు పలుమార్లు నగరానికి వచ్చి పోలీస్‌ అధికారులతో మాట్లాడడంతోపాటు బాలిక మృతిచెందిన హాస్టల్‌ భవనాన్ని, కాలేజీని కూడా పరిశీలించారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బాలిక తల్లితండ్రులు ఏపీ హైకోర్టుని ఆశ్రయుంచారు. దీనిపై ఏపీ, పశ్చిమ బెంగాల్‌లో వేర్వేరుగా కేసులు నమోదైనందున సీబీఐకి అప్పగించాలని తాము ఆదేశించలేమని హైకోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో బాధిత కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు విద్యార్థిని కేసు దర్యాప్తు మొదలుపెడితే తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని, అప్పట్లో ఈ కేసు దర్యాప్తుతో సంబంధం కలిగిన అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు…

అయితే, ఈ కేసులో దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది.. ఇప్పటికే ఈ కేసులో సంబంధం ఉన్న పలు అంశాల మీద విచారణ చేపట్టిన CBI అసలు బాగోతం బట్టబయలు చేయడానికి సిద్ధమైంది.. పోస్టుమార్టం జరిగిన కేజీహెచ్ కు సీబీఐ అధికారులు వచ్చారు.. దర్యాప్తులో భాగంగా విద్యార్థిని రీతు సాహు పోస్టుమార్టం రిపోర్టు, మెడికల్ రిపోర్ట్స్ వంటి కీలకమైన డాక్యుమెంట్లను పరిశీలించారు.. అప్పటి విచారణ కమిటీ, కేజీహెచ్ సూపరిండెంట్ వద్ద నుండి కీలకమైన సమాచారం రాబట్టినట్టు సమాచారం.. ఈ కేసులో ఆరుగురు వైద్యుల బృందం ఇచ్చిన రిపోర్ట్ లో ఎలాంటి అంశాలు పొందుపరిచారని ప్రశ్నలు కురిపించారు.. ప్రాథమిక వైద్యం అందించిన ఆసుపత్రిని ఎందుకు తనిఖీ చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.. మరి వీటన్నిటికీ విచారణ కమిటీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి..

Exit mobile version