Site icon NTV Telugu

First Railway Bridge : 130 ఏళ్ల చరిత్ర గల రైల్వే బ్రిడ్జి కూల్చివేత

Bridge

Bridge

విజయవాడ నగర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ముగింపు దశకు చేరుకుంది. బ్రిటిష్ పాలనలో కృష్ణా నదిపై నిర్మించిన మొట్టమొదటి రైల్వే వంతెన ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోనుంది. 130 ఏళ్ల క్రితం బెజవాడను దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించిన ఈ చారిత్రక కట్టడం, జ్ఞాపకాలకే పరిమితం కాబోతోంది.

IPL 2026: దుమ్మురేపే స్ట్రైక్ రేట్లు.. ఐపీఎల్‌లో ‘ధురంధర్‌’లు వీరే!

1893 మార్చి 17న బ్రిటిష్ ఇంజనీర్లు ఈ వంతెనను తొలి మీటర్ గేజ్ బ్రిడ్జ్‌గా నిర్మించారు. ఆ రోజుల్లో దీనిని ‘కృష్ణా ప్యాలెస్’ అని పిలిచేవారు. ఈ వంతెన నిర్మాణంలో ఎటువంటి స్టీల్ ఉపయోగించకపోవడం విశేషం. కేవలం రాతి బండలు, గానుగ సున్నంతో మాత్రమే నిర్మించిన ఈ కట్టడం, నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం ఆ కాలపు ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. దాదాపు ఒక శతాబ్ద కాలం పాటు, అంటే 1989 వరకు లక్షలాది రైళ్లను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఈ వంతెన, 1993లో అధికారికంగా సేవలను నిలిపివేసింది.

Abhinav Mukund: “బ్యాటింగ్‌లో టాప్.. బౌలింగ్ ఫ్లాప్”.. SRH టీమ్‌పై భారత మాజీ క్రికెటర్ షాకింగ్ స్టేట్‌మెంట్..

విజయవాడ-గూడూరు మార్గంలో రైళ్ల రద్దీ విపరీతంగా పెరగడంతో, రైల్వే శాఖ ఇక్కడ అత్యాధునిక డబుల్ లైన్ వంతెనను నిర్మించాలని నిర్ణయించింది. ఈ కొత్త వంతెన నిర్మాణానికి పాత పిల్లర్లు అడ్డుగా ఉండటం, అలాగే వరదల సమయంలో కాలం తీరిన ఈ పిల్లర్లు ప్రమాదకరంగా మారి పక్కనే ఉన్న రైల్వే బ్రిడ్జిలపై పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వే బోర్డు పాత వంతెన ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది.

ఈ వంతెన పిల్లర్లు నేటికీ ఎంత దృఢంగా ఉన్నాయంటే, వాటిని కూల్చడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. హైడ్రాలిక్ క్రేన్లతో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో, ప్రస్తుతం ‘లిమిటెడ్ బ్లాస్టింగ్’ పద్ధతిని పరిశీలిస్తున్నారు. ఒక్కో పిల్లర్‌ను తొలగించేందుకు సుమారు 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈ చారిత్రక నిర్మాణాన్ని ఒక పర్యాటక కేంద్రంగా లేదా హెరిటేజ్ సంపదగా కాపాడాలని విజయవాడ వాసులు దశాబ్ద కాలంగా కోరుతున్నారు. అభివృద్ధి వేగం ముందు ఈ అద్భుత కట్టడం కనుమరుగవుతుండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో కొద్ది రోజుల్లో కృష్ణమ్మ ఒడిలో నిలిచిన ఈ చారిత్రక చిహ్నం పూర్తిగా చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోనుంది.

Exit mobile version