Chandrababu Launches Veligonda Phase 1: దశాబ్దాలుగా తీవ్ర కరువును ఎదుర్కొంటున్న మార్కాపురం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 30 ఏళ్ల క్రితం, 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టు తొలి దశను స్వయంగా ప్రారంభించడం చారిత్రక ఘట్టంగా నిలిచింది. ‘వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత వెలిగొండ ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించి, ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.

కృష్ణా జలాలతో పులకించిన మార్కాపురం
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు తమ ప్రాంతానికి చేరుకోవడంతో మార్కాపురం ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గంటవానిపల్లి సమీపంలోని వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద సీఎం నిర్వహించిన జలహారతి కార్యక్రమాన్ని సభా ప్రాంగణం నుంచి ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. జలహారతి కార్యక్రమం సందర్భంగా గిరిజన మహిళలు తమ సంప్రదాయ పద్ధతిలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం పండితులు ముఖ్యమంత్రికి శ్రీశైలం మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డీబీవీ స్వామి, ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, ఎంపీ శ్రీనివాసరెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు హాజరయ్యారు.
తొలి దశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాల విడుదల
వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభంతో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్కు విడుదల చేశారు. ఈ నీటిని సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. మొదటి విడతలో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 4 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టును వినియోగించనున్నారు.
ఎలా పనిచేస్తుంది?
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను గ్రావిటీ ద్వారా తరలించి నల్లమలసాగర్లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి ప్రధాన కాలువల ద్వారా నీటిని వివిధ ప్రాంతాలకు తరలించి సాగు, తాగునీటి అవసరాలను తీర్చేలా ప్రాజెక్టును రూపొందించారు. కృష్ణా జలాలు అందుబాటులోకి రావడంతో ఇప్పటివరకు కరవు ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలకు భారీ ఊరట లభించనుంది.
నాలుగు జిల్లాలకు ప్రయోజనం
వెలిగొండ ప్రాజెక్టు తొలి దశతో మార్కాపురం ప్రాంతంతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరవు ప్రభావిత ప్రాంతాలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం కలగనుంది.
రైతులకు కొత్త ఆశలు
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం ఈ ప్రాంత రైతులకు ఎంతో కీలకంగా మారనుంది. సాగునీటి లభ్యత పెరగడంతో వ్యవసాయ విస్తీర్ణం పెరగడంతో పాటు కరవు ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించే అవకాశం ఉంది. అదేవిధంగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న ప్రజలకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

