US-Israeli war: పశ్చిమాసియాలో మండుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంపై కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. హర్మూస్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితి కారణంగా, విశాఖ పోర్టు నుండి ఎగుమతి అయిన వేలాది కంటైనర్లు తమ గమ్యస్థానాలకు చేరలేక మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం ప్రమాదకరమని భావించిన అధికారులు, నౌకలను తిరిగి వెనక్కి రప్పిస్తున్నారు. విశాఖ పోర్టు చరిత్రలోనే ఎగుమతి అయిన సరుకు ఈ స్థాయిలో రివర్స్ రావడం ఇదే మొదటిసారి.
సుమారు 10,000 కంటైనర్లు తిరిగి విశాఖ తీరానికి చేరుకోనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖ నుండి ప్రధానంగా సీఫుడ్ (రొయ్యలు, చేపలు), ఫార్మా ఉత్పత్తులు, , జీడిపప్పు వంటి విలువైన సరుకులు ఎగుమతి అవుతుంటాయి. ఈ సరుకులు పాడవకుండా ఉండాలంటే వాటిని నిరంతరం శీతలీకరణ యంత్రాల్లో (Refrigerated Containers) ఉంచాలి. అయితే, వీటిని యార్డుల్లో భద్రపరచడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కో కంటైనర్కు రోజుకు సుమారు ₹5,000 వరకు విద్యుత్ బిల్లు అయ్యే అవకాశం ఉందని లెక్కగట్టారు. దీనివల్ల వచ్చే లాభం కంటే నిర్వహణ ఖర్చే ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
ఒకేసారి వేల సంఖ్యలో కంటైనర్లు తిరిగి వస్తుండటంతో పోర్టులో స్థల కొరత ఏర్పడింది. ఈ కంటైనర్లను ఉంచడానికి కనీసం 16,000 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ టెర్మినల్ అధికారులు పోర్ట్ ట్రస్ట్కు లేఖ రాశారు. ఈ అసాధారణ పరిస్థితిని ఎదుర్కోవడానికి కస్టమ్స్ చీఫ్ కమిషనర్ ఎగుమతిదారులు , టెర్మినల్ నిర్వాహకులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సాధారణంగా ఎగుమతి అయ్యే సరుకుపై ఉండే నిబంధనలు, తిరిగి వచ్చే సరుకుకు వర్తించవు కాబట్టి, కస్టమ్స్ విభాగం కొత్త గైడ్లైన్స్ను రూపొందించే పనిలో పడింది.
ఎగుమతిదారుల ప్రధాన ఆందోళన సరుకు నాణ్యతపైనే ఉంది. ముఖ్యంగా సముద్ర ఉత్పత్తులను 3 నుండి 5 రోజులకు మించి నిల్వ చేయడం కష్టసాధ్యం. నౌక ప్రయాణంలో ఉన్నప్పుడు ఉండే అత్యాధునిక ప్రిజర్వేషన్ సౌకర్యాలు, పోర్టులోని యార్డుల్లో ఉండకపోవచ్చు. దీనివల్ల వేల కోట్ల రూపాయల విలువైన ఆహార ఉత్పత్తులు చెడిపోయే ప్రమాదం ఉంది. యుద్ధం కారణంగా అరేబియా సముద్రం , గల్ఫ్ దేశాల వైపు వెళ్లే మార్గాల్లో అనిశ్చితి కొనసాగుతున్నంత కాలం, ఈ ఎగుమతులకు మోక్షం లభించేలా కనిపించడం లేదు.
