RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..

Roja

Roja

RK Roja: మరోసారి తెలుగుదేశం పార్టీ, మహానాడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. టీడీపీ, సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. టీడీపీ నిర్వహిస్తున్న మహానాడును లక్ష్యంగా చేసుకుని ఆమె పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఒక “బోగస్ పార్టీ” అంటూ వ్యాఖ్యానించిన రోజా, ఆ పార్టీకి కోటి మంది సభ్యులు ఉన్నారని చెప్పుకుంటున్నప్పటికీ మహానాడును చూస్తే రాష్ట్రంలో ఎక్కడా ఉత్సాహం కనిపించడం లేదన్నారు. “మహానాడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అందుకే రికార్డ్ డ్యాన్సులు వేసి పార్టీ క్యాడర్‌ను కూర్చోబెడుతున్నారు” అంటూ ఎద్దేవా చేశారు.

మహానాడును ఉద్దేశించి “ఇది మహానాడు కాదు.. దగానాడు, మాయానాడు, భూతునాడు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజా… సూపర్ సిక్స్ హామీల గురించి ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పకుండా తల్లి, చెల్లి, గొడ్డలి అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, చంద్రబాబు.. హెరిటేజ్ ఆస్తుల్లో తన తల్లి, చెల్లికి ఎంత ఆస్తులు ఇచ్చారో చెప్పగలరా అని రోజా ప్రశ్నించారు. “వాళ్లు ఎక్కడ ఉన్నారో కూడా ప్రజలకు తెలియదు. తల్లికి, చెల్లికి సహాయం చేసినట్టు ఒక్క ఫోటో అయినా చూపించగలరా?” అని విమర్శించారు. ఈ దేశంలో జగన్ తన చెల్లికి ఇచ్చినంత ఆస్తులు మరెవ్వరూ ఇవ్వలేదని రోజా వ్యాఖ్యానించారు.

×
×
Ad

వివేకా హత్య కేసుపై ప్రశ్నలు
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై కూడా రోజా స్పందించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే వివేకా హత్య జరిగిందని గుర్తుచేస్తూ, అప్పట్లో నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. వివేకా కేసులో నిందితుడైన దస్తగిరికి టీడీపీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. “చంద్రబాబు కేసులు వాదించే లాయరే ప్రస్తుతం దస్తగిరికి లాయర్‌గా ఉన్నారు” అని పేర్కొన్నారు.

టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు
టీడీపీని “చెప్పుల పార్టీ, వెన్నుపోటు పార్టీ, దొంగల పార్టీ” అంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించారని, వెన్నుపోటు పొడిచారని, ఆయన పార్టీని దొంగతనంగా లాక్కున్నారని ఆరోపించారు. “పెద్ద ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. చిన్న ఎన్టీఆర్‌కు లోకేష్ వెన్నుపోటు పొడవలేదా?” అంటూ ప్రశ్నించారు. అలాగే పవన్ కల్యాణ్‌ తల్లిని తిట్టించింది కూడా లోకేష్ కాదా అని ప్రశ్నించారు. మరోవైపు.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని లోకేష్ చెబుతున్నారని, అయితే అది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని రోజా విమర్శించారు. “టీడీపీకి నిజంగా దమ్ముంటే మహానాడులో 33 శాతం మహిళా రిజర్వేషన్‌పై తీర్మానం చేయాలి. బీజేపీ మహిళా బిల్లును అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెప్పగలరా?” అని సవాల్ విసిరారు. జగన్ ఇప్పటికే 2023 అసెంబ్లీలో మహిళా బిల్లుపై తీర్మానం చేశారని, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఎప్పుడో ప్రకటించారని తెలిపారు.

ప్రభుత్వంపై విమర్శలు
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని రోజా ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలను చంద్రబాబు అడ్డదిడ్డంగా పెంచుతున్నారని విమర్శించారు. పేదలు ఎక్కువ మంది పిల్లలను కనాలని చెప్పే చంద్రబాబు, తన కుటుంబంలో మాత్రం ఒక్కో పిల్లవాడినే కనారని ఎద్దేవా చేశారు. లోకేష్‌పై కూడా రోజా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, “జూమ్ మీటింగ్‌లో కొడాలి నాని, వల్లభనేని వంశీ వస్తే భయపడి పారిపోయిన వ్యక్తి లోకేష్” అని విమర్శించారు. అలాగే జగన్ పీఏ కేఎన్ఆర్‌ను విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ, వైసీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఆర్కే రోజా..