Kiran Kumar Reddy: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లులో ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని ఇతర వృత్తులతో పోలిస్తే రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు, దూషణలు పెరగడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. డాక్టర్లు, న్యాయవాదులు వంటి వృత్తుల్లో ఉన్నవారు ఒకరినొకరు గౌరవించుకుంటూ, అవసరమైనప్పుడు పరస్పరం మద్దతు ఇస్తారని పేర్కొన్నారు. కానీ, రాజకీయాల్లో మాత్రం వ్యక్తిగత విమర్శలు ఎక్కువవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాలు ప్రజలకు సంబంధించిన అంశమని, పాలసీలు, అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చలు జరగాలని సూచించారు కిరణ్.. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలతో రాజకీయాల స్థాయి దిగజారుతోందని వ్యాఖ్యానించారు. ఇక, ప్రస్తుత టెలివిజన్ డిబేట్లు కుటుంబ సభ్యులతో కలిసి చూసే పరిస్థితి లేదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కొన్ని చర్చలు చూస్తే టీవీనే ఆఫ్ చేయాలనిపించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో అసభ్య పదజాలం వినియోగించడం కూడా మంచి పద్ధతి కాదని హితవు పలికారు. రాజకీయ నాయకుల మధ్య పరస్పర గౌరవం ఉండాలని, ఒకరి గౌరవాన్ని మరొకరు తగ్గించుకునే ధోరణి వల్లే రాజకీయ విలువలు క్షీణిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి..

