Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు మరియు ఆర్జిత సేవా టిక్కెట్లను ఇవాళ్టి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు భక్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అనంతరం ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్ల కేటాయింపు జరగనుంది.
ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు.. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 91,020 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,193 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే హుండీ ఆదాయం రూ.3.54 కోట్లుగా నమోదైంది. ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, నటుడు ఆది పినిశెట్టి కూడా శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
