Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్‌ ఫైర్‌

Raghunandan Rao

Raghunandan Rao

Raghunandan Rao: తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు తీవ్రంగా తప్పుబట్టారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఉదయనిధి స్టాలిన్‌కు జ్ఞానోదయం కలగలేదని విమర్శించారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకునే ధర్మమే సనాతన ధర్మం అని పేర్కొన్నారు రఘునందన్.. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. ఇక, ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, ఆ ప్రభావంతోనే స్టాలిన్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.

ఇక, ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న ఉదయనిధి స్టాలిన్ భవిష్యత్తులో మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజల విశ్వాసాలు, హిందూ సంప్రదాయాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు.. కాగా, తమిళనాడు శాసనసభలో మంగళవారం చర్చాకార్యక్రమంలో ప్రతిపక్ష నేత, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ మరోసారి తన ‘సనాతన ధర్మ’ వ్యతిరేక గళాన్ని వినిపించారు. ప్రజల మధ్య విభజన తెచ్చే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన పాత నినాదాన్ని అసెంబ్లీ వేదికగా పునరుద్ఘాటించారు. “మనుషుల మధ్య దూరాన్ని పెంచే సనాతన ధర్మాన్ని అంతం చేయాల్సిందే” అని స్పష్టం చేశారు. అదే సమయంలో సభలో హుందాతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. రాజకీయ నాగరికత గురించి ప్రస్తావిస్తూ.. “నిన్న కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు మా నాయకుడితో పాటు ఇతర రాజకీయ నేతల నుంచి ఆయనకు శుభాకాంక్షలు అందాయి. అటువంటి రాజకీయ మర్యాదలు ఈ సభలోనూ కొనసాగాలి. మనం అధికార, ప్రతిపక్ష వరుసల్లో వేర్వేరుగా కూర్చున్నప్పటికీ, తమిళనాడు అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలి” అని ఉదయనిధి పిలుపునిచ్చారు. సభలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు ఉదయనిధి స్టాలిన్..