NTV Telugu Site icon

TTD Pavithrotsavam 2024: పవిత్రోత్సవాలకు నేడే అంకురార్పణ.. శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక..

Ttd

Ttd

TTD Pavithrotsavam 2024: తిరుమలలో పవిత్రోత్సవాలకు ఈ రోజు అంకురార్పణ జరగనుంది.. రాత్రి 7 గంటలకు మాడవీధులలో ఊరేగనున్నారు శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు.. దీంతో.. ఇవాళ శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవ రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ).. ఇక, రేపటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో.. ఈ మూడు రోజులు పాటు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.. మరోవైపు ఈ నెల 18వ తేదీన శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం రద్దుచేశారు అధికారులు.. కాగా, శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు శాస్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ.. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జాతశౌచం, మృతశౌచం వంటి సమయాల్లో తెలిసో తెలియకో భక్తులు, సిబ్బందిచే కలిగే దోషాల వలన ఆలయం పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకే మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవమే పవిత్రోత్సవం.

Read Also: Google Pixel 9 Price: గూగుల్‌ పిక్సెల్‌ 9 ఫోన్స్ వచ్చేశాయి.. ధర, ఫీచర్ల డీటెయిల్స్ ఇవే!

ఇక, చారిత్రక నేపథ్యం వున్న పవిత్రోత్సవాలను 15వ శతాబ్ధంలో 5రోజుల పాటు నిర్వహించేవారు. ముఖ్యంగా క్రీ.శ.1464లో ఒక తమిళ శాసనంలో ఈ పవిత్రోత్సవాల ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో శ్రావణ మాసంలో పంచాహ్నికంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీమాన్ మహమండలేశ్వర మేదిని మీశర గండకట్టారి సాళువ మల్లయ్యదేవ మహారాజు వ్రాయించిన శాసనంలో మనకు ఈ విషయం అవగతమవుతుంది. అయితే, శాసనాల ఆధారం ప్రకారం పవిత్రోత్సవాలను క్రీ.శ. 1562 వరకు నిరాఘాటంగా నిర్వహించినట్లు తెలుస్తున్నది. ఏ కారణం చేతనో అ తరువాత కాలంలో పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆపివేశారు. హైందవ సనాతన ధర్మ సంరక్షణ ను కాపాడేందుకు 1962 నుంచి టీటీడి పవిత్రోత్సవాల కార్యక్రమాన్ని పున:ప్రారంభించింది.

Read Also: Google Pixel 9 Price: గూగుల్‌ పిక్సెల్‌ 9 ఫోన్స్ వచ్చేశాయి.. ధర, ఫీచర్ల డీటెయిల్స్ ఇవే!

పవిత్రోత్సవాలలో మొదటి రోజు శ్రీవారి ఆలయంలోని యాగశాలలో హోమాన్ని నిర్వహించి పవిత్ర ప్రతిష్ట చేస్తారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తారు అర్చకులు. ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం కార్యక్రమాని నిర్వహించిన అనంతరం శ్రీవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తులు, అనుబంధ ఆలయాలలో అర్చకులు పవిత్రాలు సమర్పిస్తారు. దీంతో మొదటి రోజు కార్యక్రమం పరిసమాప్తమవుతుంది. రెండోవ రోజు వైఖానస అగమ శాస్త్రం ప్రకారం అర్చకులు పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఏవైనా పొరపాట్లు జరిగి వున్న మరియు భక్తుల వల్ల ఏదైనా దోషాలు జరిగి వుంటే తొలగిపోవాలంటూ పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చకులు. మొదట స్వామి, అమ్మ వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం స్వామి వారి మూల విరాట్‌కు అనుబంధ ఆలయాల్లో ఉన్న విగ్రహాలకు పవిత్ర మాలలు సమర్పించడంతో కార్యక్రమం ముగుస్తుంది.