దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.. అయితే, మరోసారి విజయంపై కన్నేసిన వైసీపీ.. బద్వేల్ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధా పేరును ఖరారు చేసింది.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణియే.. డాక్టర్ సుధా.. ప్రస్తుతం కడపలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారామె.. ఈ ఏడాది మార్చి 28న అనారోగ్యంతో ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూయడంతో.. ఆయన సతీమణి సుధాకు టికెట్ ఖరారు చేశారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే బద్వేల్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల్లో అభ్యర్థిగా పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆమె.. ఇంటింటి పరిచయ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా బద్వేల్ ఉప ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. తాజాగా వెలువడిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల్లో ఆ నియోజకవర్గం పరిధిలో పర్వాలేదు అనిపించింది టీడీపీ.. దీంతో.. బద్వేల్ ఉప ఎన్నికల్లో విజయం ఏమో కానీ.. గట్టి పోటీ ఇవ్వగలం అనే ధీమాతో ఉన్నారు ఆ పార్టీ శ్రేణులు.. త్వరలోనే ఆ నియోజకవర్గ నేతలతో సమవేశం కానున్నారు పార్టీ అధినేత చంద్రబాబు.. ఉప ఎన్నికల కోసం ఇంఛార్జ్లను నియమించేందుకు ప్లాన్ చేస్తున్నారు.. కాగా, బద్వేల్ నియోజకవర్గంలోనే ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఓ ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను కైవశం చేసుకుంది టీడీపీ.. పార్టీ అధినాయకత్వం ఎన్నికలను బహిష్కరించినా.. స్థానిక నేతలు గట్టిగా ప్రయత్నాలు చేసి.. మంచి ఫలితాలను సాధించారు.. దీంతో.. బై పోల్పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాఉ.. ఫోకస్ పెడితే అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వొచ్చనే లెక్కలు వేస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ని బద్వేల్ అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ.