Off The Record: సింహపురి రాజకీయాల్లో జనసేన వ్యూహం ఆసక్తికరంగా మారుతోంది. పార్టీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నా…. అధిష్టానం మాత్రం అంత తొందరొద్దు కాస్త ఆగండని అంటోందట. ఒంగోలులో బాలినేని.. దామచర్ల ఎపిసోడ్ తరువాత.. ఇతర పార్టీల నుంచి తీసుకునే విషయంలో తొందరపాటు వద్దని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. బలోపేతం పేరుతో ఎవరంటే వారిని తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతామన్న భావనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు చెబుతున్నారు. అందుకే.. వస్తామన్న వాళ్ళందరికీ కాస్త ఆగండంటూ స్మూత్గా చెబుతున్నారట. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పదికి పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు గెలిచారు. ఒకటి రెండు నియోజకవర్గాలలో జనసేన నేతల సహకారంతోనే గెలుపు సాధ్యమైందన్న లెక్కలు ఉన్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక టిడిపి నేతలకు, గ్లాస్ లీడర్స్కు ఎక్కడా సఖ్యత ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలో వైసిపి నుంచి బయటకు వచ్చేసిన నేతలతో పాటు.. టిడిపిలో అసంతృప్తిగా ఉండే వాళ్ళు కూడా జనసేనకు టచ్ లోకి వెళ్తున్నారట. పాత పరిచయాలని తెరమీదకు తీసుకొచ్చి.. మేం కూడా పార్టీలోకి వస్తామబ్బా…. పవన్ కల్యాణ్కి ఓ మాట చెప్పొచ్చు కదా అంటూ రాగాలు తీస్తున్నారట. మెమొస్తే పార్టీ బలోపేతం అవడంతో పాటు.. ఆర్థికంగా కూడా అండగా ఉంటాం కదా అని ఆఫర్స్ కూడా ఇస్తున్నట్టు సమాచారం.
ఇప్పుడు జనసేనలో ఉండే నేతలకు జనాల్లో చరిష్మా, ఆర్థిక బలం రెండూ లేవని.. తాము వస్తే పొలిటికల్ కలర్ ఉంటుందని నచ్చజెపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కావలి నియోజకవర్గానికి చెందిన సుకుమార్ రెడ్డి జనసేనలో చేరేందుకు ఇటీవల ఓ కీలక నేతతో మంతనాలు జరిపారట. ఇవాళో.. రేపో చేరిక ఖాయం అన్నట్లుగా ఉన్న సమయంలో..సుకుమార్ రెడ్డి గురించి అధినేత నివేదిక తెప్పించుకున్నారన్నది ఇంటర్నల్ టాక్. వైసీపీ హయాంలో కావలిలో అక్రమ లేవుట్ల వ్యవహారంలో ఆయనపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని.. ఇప్పుడే తీసుకుంటే.. చర్యల నుంచి తప్పించుకునేందుకే పార్టీలో చేరారన్న చెడ్డ పేరు మనకు కూడా వస్తుందని పవన్ కళ్యాణ్ భావించినట్టు తెలిసింది. దీంతో కొద్ది రోజులు ఆగమని పెద్దల నుంచి సందేశం వచ్చినట్టు తెలిసింది. మరోవైపు కావలి జనసేన నేతలు సుకుమార్రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారట.. దీంతో అందరితో మాట్లాడి సయోధ్య కుదిరిన తరువాతే తీసుకోవాలన్న ఆలోచనలో అధిష్టానం ఉందన్నది పార్టీ సమాచారం. అటు వైసీపీకి చెందిన ఒకరిద్దరు నేతలు సైతం జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలకు టచ్లో ఉన్నట్టు తెలిసింది. అయితే ఇప్పుడే చేరికలు అవసరం లేదని, స్థానిక ఎన్నికల తరువాత చూద్దామని చెప్పినట్టు సమాచారం.
ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజనపై క్లారిటీ వచ్చిన తర్వాతే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని గ్లాస్ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పునర్విభజన తర్వాత నియోజకవర్గాల స్వరూపం ఎలా మారుతుంది..? జనసేనకు ఎన్ని స్థానాలు దక్కుతాయి..? కూటమిలో సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది..? లాంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చేరికలకు గెట్లెత్తాలనుకుంటున్నారట. ఓవరాల్లో పార్టీలో చేరతామని వెళ్లే నేతల వ్యక్తిగత బలంతో పాటు.. వారి పొలిటికల్ ట్రాక్ రికార్డ్, స్థానిక టీడీపీ నేతలతో ఉండే సంబంధాలు లాంటి రకరకాల ప్రామాణికాలను జనసేన పెద్దలు పరిగణనలోకి తీసుకుని ఫిల్టర్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడే చేరికలు జరిగితే.. స్థానికంగా టీడీపీతో సమన్వయం విషయంలో ఇబ్బందులు వస్తాయన్న అభిప్రాయం కూడా ఉందట. పునర్విభజన జరిగితే నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి… జిల్లాలో రెండు నుంచి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు అడగాలన్న ఆలోచనలో జనసేన ఉన్నట్టు తెలుస్తోంది. అప్పటి పరిస్థితుల్ని బట్టి ఆయా నియోజకవర్గాలకు సెట్ అయ్యే నేతలను తీసుకుంటే సరిపోతుందిగానీ…. ఇప్పుడే తొందరపడి తర్వాత ఇబ్బంది పడటం ఎందుకని అనుకుంటున్నారు గ్లాస్ పెద్దలు. అందుకే…పార్టీలోకి వస్తామన్న వాళ్ళని.. మరీ అంత తొందరపడకండర్రా….కాస్త ఆగండ్రా… బాబూ… అని అంటున్నట్టు చెప్పుకుంటున్నారు.

