పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ. 55 వేల కోట్లు నిధులు ఇచ్చింది ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డబ్బులు డ్రా చేయాలని తపన తప్ప ప్రాజెక్టులు గురించి రాష్ట్ర ప్రభుత్వం అలోచన చేయడం లేదని ఆయన మండిపడ్డారు. రాయలసీమలో ఉండే నీటి సమస్యపై ఈ నెల 19 న రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా కడప లో బీజేపీ భారీ ఎత్తున ధర్నా చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాయలసీమను రత్నాలసీమగా చూడాలని ప్రయత్నం చేస్తున్నామని, కేంద్రం ఇచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ (NREGS) నిధులతో గతంలో చంద్రన్న బాట, ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాలు, జగనన్న ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాలు కట్టారని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద నగరంలో 16 లక్షలు ఇల్లు, పంచాయతీల్లో 5 లక్షలు ఇల్లు నిర్మిస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 40 వేలు కోట్లు జగనన్న కాలనీలకు ఉపయోగించారని ఆయన ఆరోపించారు. అవి జగనన్న కాలనీ కాదు మోడీ కాలనీలు అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ, జనసేన కలసి ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.