Kotamreddy Sridhar Reddy: మొన్న ఆనం.. నేడు కోటంరెడ్డి.. షాకిచ్చిన వైసీపీ సర్కార్‌.

Kottamreddy

Kottamreddy

Kotamreddy Sridhar Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో రెబల్‌ ఎమ్మెల్యేల భద్రత తొలగింపు కొనసాగుతూనే ఉంది.. మొన్నటికి మొన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి భద్రత తగ్గించిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌.. ఇప్పుడు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి షాక్ ఇచ్చింది. సెక్యూరిటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 2 ప్లస్ 2 గా ఉన్న గన్ మెన్లను 1 ప్లస్ 1 కు కుదించింది. ప్రభుత్వంపై ఇటీవల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఈ వ్యవహారంపై తీవ్రదుమారం చెలరేగింది. ఇదే సమయంలో.. ఆయనకు బెదిరింపు కాల్స్‌ కూడా వచ్చాయి.. ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇంతలోనే సెక్యూరిటీ తగ్గించడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది..

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

అయితే, ప్రభుత్వంపై అసంతృప్తి గళం వినిపించిన ఎమ్మెల్యేలకు వైసీపీ ప్రభుత్వం భద్రత తగ్గిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.. మొన్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి.. నేడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి భద్రత తగ్గింపు చర్చగా మారింది.. కాగా, వైసీపీలో సరైన గౌరవం దక్కడం లేదంటూ గళమెత్తిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ చేసిన కామెంట్లు కాకరేపాయి.. ఈ దెబ్బతో ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని రంగంలోకి దింపిన వైసీపీ అధిష్టానం.. కోటంరెడ్డికి షాకిస్తూ.. నెల్లూరు రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నియమించింది.. ఇక, కోటంరెడ్డి వెనుకున్నవారు.. కొంతమంది.. ఆయనపై మండిపడుతూ.. ఆదాలకు మద్దతు ప్రకటిస్తున్నారు. మరోవైపు.. కోటంరెడ్డి, మంత్రులు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.