ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు ఏపీ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మళ్ళీ అధికారంలోకి రాలేం అన్న నిస్పృహతో చంద్రబాబు మాయా యుద్ధం చేస్తున్నారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. అన్నీ అభూత కల్పనలు. ఒకటికి వందసార్లు అబద్ధాలు చెబుతూ నిజాలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయం చేసే విధానం ఇది కాదన్నారు సజ్జల. ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని చంద్రబాబుపై మండిపడ్డారు.
2014లో అదృష్టవశాత్తు వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు ఉపయోగించుకుంటాడు అనుకున్నాం. కానీ చంద్రబాబు వైఖరి మారలేదు. మద్యంలో విషం కలుపుతున్నారనే ఆరోపణలు దారుణంగా వున్నాయన్నారు. తాను అధికారంలోకి లేనన్న ఆక్రోశంతో తప్పుడు ఆరోపణలతో వ్యవస్థనే నేరస్థుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవస్థలన్నీ నమ్మకం పైనే నడుస్తాయి. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం మంచిది కాదన్నారు. చంద్రబాబుకు ప్రజల పట్ల బాధ్యత లేదన్నారు.
కార్యకర్తల్లో అసంతృప్తి ఉందంటేనే ప్రభుత్వం ఎంత నిష్పాక్షికంగా ఉందనేది అర్ధం. దీనిలో దాపరికం లేదు. చంద్రబాబులా మా వాళ్ళకే మేలు జరగాలన్న ఆలోచన జగన్కు ఉండదు. మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ రాష్ట్రం బాగుంది. సాంకేతిక సమస్య వల్లే జీపీఎఫ్ అకౌంట్ల నుంచి డబ్బులు విత్ డ్రా అయ్యాయి. ప్రభుత్వం అంటే ఏమైనా మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీనా?? ఉద్యోగుల సొమ్మును ఇష్టం వచ్చినట్టు తీసుకుని ఊరుకోవటానికి?
ఉద్యోగుల సొమ్ము 800 కోట్లను తీసుకుని ప్రభుత్వం ఏం చేస్తుంది?? ఏ ప్రభుత్వమైనా ఉద్యోగుల సొమ్మును తీసేసుకోగలుగుతుందా? దాని వల్ల ప్రభుత్వానికి ఏం లాభం కలుగుతుంది? చంద్రబాబు అధికారంలో లేడనే కారణంతో ఒక చిన్న సాంకేతిక సమస్యను కూడా ఆర్ధిక సంక్షోభ స్థాయిలో ఒక వర్గం మీడియా చూపిస్తోందన్నారు సజ్జల.