అమరావతిలోని తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం’ ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి వైస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం పూర్తిగా కరువైందని, అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితులు తాత్కాలికమేనని, మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆర్యవైశ్యుల్లో ధైర్యం నింపారు. రాష్ట్రంలో ప్రస్తుత అధికార పీఠాన్ని ప్రజాక్షేత్రంలో ప్రశ్నించే ఏకైక పార్టీ వైస్సార్సీపీ మాత్రమేనని, ప్రజల తరఫున వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలంగా నిలబడుతున్నారని స్పష్టం చేశారు.
జగన్ హయాంలోనే సమతుల్య పరిపాలన.. సంక్షేమ విప్లవం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందాయని సజ్జల గుర్తుచేశారు. కేవలం వెనుకబడిన వర్గాలకే కాకుండా, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు (EBC) సైతం జగన్ ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనిచ్చి ఆదుకుందని చెప్పారు. చట్టబద్ధమైన పాలన, సమతుల్య పరిపాలన జగన్ హయాంలోనే ప్రజలు చూశారని కొనియాడారు. వైశ్య సమాజం ఎప్పుడూ శాంతి, ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటుందని.. జగన్ పాలనలో వ్యాపారస్తులకు, సామాన్యులకు అలాంటి సురక్షితమైన వాతావరణం లభించిందని వివరించారు.
చారిత్రక సంస్కరణలు.. అమరావతి పేరుతో అప్పుల ఊబి
విద్య, వైద్య రంగాల్లో గత జగన్ ప్రభుత్వం చారిత్రక మార్పులు తీసుకొచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి, కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం వల్లే నేడు వాటిపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని అన్నారు. జగన్ తీసుకొచ్చిన ఈ అద్భుతమైన సంస్కరణల అసలు విలువను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి వైస్సార్సీపీ నాయకుడిపై ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక భారాన్ని పెంచకుండా గత ప్రభుత్వం బ్యాలెన్స్డ్గా నడిపిస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమరావతి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రతి బాధ్యతాయుతమైన పౌరుడు జగన్ తరహా సంక్షేమ పాలననే కోరుకుంటారని, పార్టీ కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని సజ్జల స్పష్టం చేశారు.

