Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని ఆర్ధిక శాఖ పేర్కొంది. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వేతనాలు తీసుకుంటున్న స్థానిక సంస్థలు, రాష్ట్ర సచివాలయం, శాసన పరిషత్ ఉద్యోగులు అధికారులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. న్యాయాధికారులు, గ్రామ అధికారులు మినహా 309 అధికరణ కింద నియమితులైన ఉద్యోగులు అధికారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Read Also:PayCM: బెంగళూరులో ‘పేసీఎం’ పోస్టర్ల వివాదం.. పలువురు కాంగ్రెస్ నేతల అరెస్ట్
కాగా 62 ఏళ్ల ఉద్యోగ విరమణ పెంపు వర్తిస్తుందంటూ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సంస్థలు, కంపెనీలు, సొసైటీలు, విద్యా సంస్థలు, యూనివర్సిటీల్లో ఆదేశాలు ఇవ్వటంపై ఆర్ధిక శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అనుమతి, అధికారం లేకుండా ఆయా సంస్థలు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఎలాంటి అధికారిక ఉత్తర్వు లేకుండా ఉద్యోగ విరమణ పెంపు వర్తింప చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆర్ధికశాఖ తేల్చి చెప్పింది. ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ మెమో జారీ చేసింది. ఈ వ్యవహారంపై జరిగిన ఉల్లంఘనలపై నివేదిక పంపాలంటూ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. సెప్టెంబరు 30 తేదీలోగా ఆర్ధికశాఖకు నివేదికను పంపాలని కోరుతూ సర్కులర్ మోమో ఇచ్చింది.
