ఆరోగ్య శ్రీ పరిధిలోకి కొత్తగా 809 చికిత్సలు చేర్చింది ఏపీ ప్రభుత్వం. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ వీటిని ప్రారంభించారు. వీటితో ఆరోగ్య శ్రీ చికిత్సలు మొత్తంగా 3,255కి చేరాయి. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే అధికంగా 2,196 చికిత్సలు అందిస్తున్నామన్నారు సీఎం జగన్. సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నాడు జరిగిన వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో సీఎం జగన్ నూతన చికిత్సలను ఆరోగ్య పథకం కింద అమలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకం అమలుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also: Harish Kalyan: ఘనంగా జెర్సీ హీరో పెళ్లి.. వధువు ఎవరో తెలుసా..?
టీడీపీ ప్రభుత్వంలో కేవలం ఆరోగ్య శ్రీ కింద 1059 చికిత్సలు అందిస్తుండగా వాటిని తమ ప్రభుత్వంలో 3,255కు పెంచినట్లు వివరించారు. మే 2019 నాటికి ఆరోగ్య శ్రీ వైద్య చికిత్సల సంఖ్య 1059 ఉండగా జనవరి 2020లో 2059 పెంచామన్నారు. వైద్యం ఖర్చు 1000 రూపాయలు పైగా ఖర్చయ్యే ప్రతి చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చినట్లు తెలిపారు. జులై 2020లో 2200, నవంబర్ 2020లో 2436, జూన్ 2021లో 2446కు, 2022లో 3255 కు పెంచిమన్నారు. చంద్రబాబు హయాంలో 2018–19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా రూ.1299.01 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు రూ.2894.87 కోట్లుగా ఉందని వివరించారు. టీడీపీ ప్రభుత్వం కన్నా మూడు రెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నామన్నారు.
