Site icon NTV Telugu

RIP Mallu Swarajyam: రేపటి తరాలకు తరగని స్ఫూర్తి

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆకస్మిక మరణం పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మల్లు స్వరాజ్యం మరణంతో ఆసుపత్రికి చేరుకున్నారు సీపీఎం నేత, మాజీ ఎంపీ మధు. ఆమె మరణానికి తీవ్ర సంతాపం తెలిపారు. స్వరాజ్యం మరణం తీరని లోటు. భూస్వామ్యక కుటుంబంలో పుట్టిన పోరాట యోధురాలుగానే ఆమె నడిచింది. ఆమె జీవితం ప్రజల కోసం అర్పించింది అన్నారు మధు. మల్లు స్వరాజ్యం ఆకస్మిక మృతికి సంతాపం తెలిపారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, పీడిత ప్రజల పక్షపాతి, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర సంతాపం తెలిపారు. నాటి రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం అని సీఎం అన్నారు. తన జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన మల్లు స్వరాజ్యం జీవన గమనం గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తి దాయకం అని సీఎం తెలిపారు. మల్లు స్వరాజ్యం వంటి మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

https://ntvtelugu.com/freedom-fighter-mallu-swarajyam-is-no-more/

స్వాతంత్య్ర సమరయోధురాలు శ్రీమతి మల్లు స్వరాజ్యం నేడు అనారోగ్యంతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చివరివరకు నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన వ్యక్తి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం వారి పక్షాన నిలబడి పోరాడిన వ్యక్తి. శ్రీమతి మల్లు స్వరాజ్యం మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని సంతాపం తెలిపారు కిషన్ రెడ్డి. మల్లు స్వరాజ్యం మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అని ప్రకటన విడుదల చేశారు.

స్వరాజ్యం గారు మరణం తెలంగాణ కు తీరని లోటు. సాయుధ పోరాటంలో ముందుండి నడిపించిన నాయకురాలు స్వరాజ్యం అన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఆమెను మాలాంటి వారు ఎందరో స్ఫూర్తిగా తీసుకున్నాం. శ్రీమంతుల కుటుంబం నుంచి వచ్చిన ఆమె పోరాటం సాగించింది. 90 సంవత్సరాల వరకు ప్రజా క్షేత్రంలో స్వరాజ్యం వున్నారు. పేద, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు ఆమె ఆశా జ్యోతి. నాకు, నా కుటుంబానికి వ్యక్తిగతంగా స్వరాజ్యం గారు స్ఫూర్తి. ప్రజల్లోకి వెళ్లి నువ్వు కొట్లడలి అని నాకు ఆమె చెప్పింది. తెలంగాణ శిఖరాగ్రం నేలకొరిగింది. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాం అన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.

Exit mobile version