Pawan Kalyan To Visit Visakhapatnam Today In His 3 Days Uttarandhra Tour: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. తొలుత ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఎన్ఏడీ ఫ్లై ఓవర్, తాటి చెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సిరిపురం సర్కిల్, పార్క్ హోటల్, బీచ్ రోడ్ మీదగా.. నోవాటెల్ హోటల్కి చేరుకోనున్నారు. సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం రేపు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజల నుంచి వాళ్ల సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించనున్నారు.
అదే రోజు సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమవుతారు. సోమవారం ఉదయం ప్రెస్మీట్ నిర్వహించిన తర్వాత విజయనగరం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ నాయకులకు, శ్రేణులకు.. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమం సమయంలోనే పవన్ ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకోవడంతో.. ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అంతకుముందు.. విశాఖ గర్జన ఎందుకు అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ నిలదీశారు. ఆసుపత్రిలో మృతి చెందినవారిని తరలించేందుకు వాహనం కూడా సమకూర్చలేనందుకా? కన్నుమూసిన బిడ్డను భుజాన వేసుకొని బైక్ మీద తీసుకువెళ్లేలా చేసినందుకా? అంబులెన్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నందుకా? దేనికి మీ గర్జనలు అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.