NTV Telugu Site icon

One Rupee Idly, Bonda : క్వాలిటీ, రుచిలో నో కాంప్రమైజ్

రూపాయికి ఏం వస్తుంది. ఒక అగ్గిపెట్టె.. ఒక చాక్లెట్.. అంతకుమించి ఏమీ రావు. కానీ ఏపీలో అక్కడికెళితే ఒక్కరూపాయికి మీ ఆకలి తీరుతుంది. అక్కడ వేడి వేడి ఇడ్లీని కస్టమర్లకు అందిస్తున్న ఈయన పేరు చిన్ని రామకృష్ణ. అందరూ రాంబాబుగా పిలుచుకునే ఈయన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని ఆర్బీ కొత్తూరు గ్రామంలో ఓ చిరు హోటల్ యాజమాని. గత 16 సంవత్సరాలుగా రాంబాబు ఆర్బీ కొత్తూరు గ్రామంలో ఈ జనతా హోటల్ నడుపుతున్నాడు. ఐతే ఈ హోటల్ ప్రత్యేకత ఏంటంటే… ఒక్క రూపాయికే ఇడ్లీ..లేదా మైసూర్ బోండా చౌకగా కస్టమర్లకు అందివ్వడం. అందుకే తెల్లారగానే రాంబాబు హోటల్ ముందు కస్టమర్లు క్యూ కడుతుంటారు. ఒక్క ఆర్బీ కొత్తూరు గ్రామస్ధులే కాదు.. ఆ చుట్టు పక్కల ఉన్న పది గ్రామాల ప్రజలు రాంబాబు హోటల్ కే వచ్చి కడుపు నిండా టిఫిన్ తిని వెళ్తారు.

రాంబాబు హోటల్ లో ఇడ్లీ ..బొండా తిన్నారంటే చాలు…తినేకొద్ది ఆకలి‌ పుడుతునే ఉంటుందట. టిఫిన్ లో అందించే పల్లీల చట్నీ చాల రుచికరంగా ఉంటుందని కస్టమర్లు చెబుతుంటారు. ఐతే ఈ చట్నీని మాత్రం రాంబాబు సతీమణీ రాణి చేస్తారు. తెల్లవారు జామున మూడు గంటలకే నిద్రలేచి ..ఉ.5 గంటల కల్లా వేడి వేడిగా టిఫిన్ సిద్దం చేస్తారు. దీంతో వ్యవసాయ పనులకు వెళ్ళే కూలీలు రాంబాబు హోటల్ లో టిఫిన్ ఆరగించి పనులకు బయలు దేరతారు.ఆ తరువాత చుట్టు పక్కల ఉన్న ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బంది కూడా ఇక్కడికే వచ్చి టిఫిన్ తినడంతో పాటుగా తమ తోటి కార్మికులకు..టిఫిన్ పార్శిళ్ళు కట్టించుకుని తీసుకువెళ్తారు. కొందరైతే హోటల్ దగ్గర రష్ పెరిగి సకాలంలో టిఫిన్ అందక అక్కడ నుండి అలిగి వెళ్ళిపోతుంటారని రాంబాబు భార్య రాణి అంటున్నారు.

ఇక రాంబాబు హోటల్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. పదవ తరగతి ఫెయిల్ అయిన రాంబాబు మొదట్లో తన తండ్రితో పాటుగా మసాలా సామాన్లు అమ్మేవారు. ఐతే ఆ వ్యాపరం అంతగా కలిసి రాకపోవడంతో తన ఇంటి వద్దే 16 ఏళ్ళ క్రిందట చిన్న కాకా హోటల్ పెట్టుకున్నాడు.మొదట్లో అర్ధ రూపాయికే ఇడ్లీ ఇచ్చిన రాంబాబు ఆ తర్వాత దానిని రూపాయికి పెంచాడు.

ఇక అప్పటి నుండి రూపాయికే ఇడ్లీ,మైసూర్ బొండా ఇస్తూ..నేటీకి వాటి ధరలను పెంచలేదు.ఇక రాంబాబు అందించే టిఫిన్ నాణ్యత,రుచి విషయంలో ఎక్కడా రాజీ పడడు.అందుకే ప్రతిరోజు 400 లకు పైగా కస్టమర్లు రాంబాబు టిఫిన్ కోసం ఆర్బీ కొత్తూరు వస్తుంటారు. వీరీలో 80శాతం మంది టిఫిన్ పార్శిల్ చేయించి తీసుకువెళ్తారు.ఐతే రూపాయికే ఇడ్లీ ఇవ్వడం ఎలా గిట్టుబాటు అవుతుంది అని అడిగితే ఆయన ఇచ్చే సమాధానం ఒక్కటే. నాణ్యత.. రుచిలో రాజీ పడను. కస్టమర్లు పెరిగితే లాభాల మార్జిన్ దానంతట అదే వస్తుందని అంటున్నారు.

ఆ మధ్య ఇడ్లీ రేటు పెంచమని కొందరు తోటి వ్యాపారులు రాంబాబుపై ఒత్తిడి తెచ్చారు. కానీ వారి మాటను పట్టించుకోకుండా ఒక్కరూపాయికే అమ్మడం కొనసాగిస్తున్నారు. ప్లేట్ టిఫిన్ తినాలంటే రూ.పది నుండి రూ. 30లు ఖర్చు పెట్టాల్సిన ఈ రోజుల్లో రూపాయికే ఇడ్లీ ఇస్తూ రూపాయి విలువ పెంచి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. స్వంత లాభం సొంతమానుకుని.. పరులకు సాయ పడడంలో ఎంతో ఆనందం వుందంటున్నారు రాంబాబు.