1.తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమ సత్తా చాటుతామని, కేసీఆర్ కు బుద్ధి చెబుతామన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.హైదరాబాద్ బీజేపీ జోనల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఈనెల 6 నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
2.అమరావతి: టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీలో ఏపీ సీఎం జగన్పై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో సూత్రధారి ఎవరో తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందన్నారు. వివేకా హత్య కేసులో జగన్ పూర్తిగా కూరుకుపోయారని చంద్రబాబు ఆరోపించారు. వివేకా హత్యను గతంలో తనపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారని.. బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పూర్తిగా పతనమయ్యారని విమర్శించారు.
3.ఏపీలో జిల్లాల విభజన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాల విభజనపై వస్తున్న అభ్యంతరాలను ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల విభజన పక్రియపై ప్రణాళిక శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ స్పందించారు. విశాఖలో నాలుగు జిల్లాలకు సంబంధించిన అభ్యంతరాలు పరిశీలించామని.. వాటిలో ఏవి సహేతుకంగా ఉన్నాయో.. ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయో అన్న విషయాన్ని పరిశీలించామని ఆయన తెలిపారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
4.సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో చేపడుతున్న పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. 32 రోజుల పాటు, 506 కిలోమీటర్ల దూరం పాద యాత్ర చేస్తున్నారు. పీపుల్స్ మార్చ్ పేరిట ఈ పాద యాత్ర ప్రారంభం అయ్యింది.మొదటి రోజు పాదయాత్ర ను ముదిగొండ మండలం యడవెల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజలు చేసి శ్రీకారం చుట్టారు. కుటుంబ సమేతంగా దేవాలయంలో పూజలు చేసి అనంతరం యాత్రను చేపట్టారు. యడవెల్లి, మాధాపురం, కట్టకూర్, మేడేపల్లి, యడవెల్లి లక్ష్మీ పురంల మీదుగా ముదిగొండకు చేరుకుంది. పాద యాత్ర సందర్బంగా గ్రామ గ్రామాన మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.
5.తనను, తన కుటుంబాన్ని అవమానపర్చే విధంగా కథనాలను ప్రచురించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరువు నష్టం దావా వేశారు. సాక్షి పత్రికలో తనను కించపరుస్తూ కథనాలను ప్రచురించినందున 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి నేడు విశాఖకు నారా లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. కేసు వచ్చే నెల 14 వాయిదా వేసారని ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా హాజరు కావోద్దని కోర్టు తెలిపిందన్నారు. తప్పుడు వార్తలు ఎవ్వరు రాసిన ఊరుకోనేది లేదని, ఇంకా ఎన్నాళ్ళు మాపై తప్పుడు వార్తలు రాస్తారని, జగన్ లాగా 16 నెలలు జైల్ కి వెళ్లి కోర్టు కి రాలేదు…న్యాయం కోసం వచ్చానన్నారు.
6.ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా బీర్ల ధరలు భారీగా పెరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే బీరు తయారీలోకి వినియోగించే ప్రధాన ముడి పదార్థం బార్లీ ఉత్పత్తిలో రష్యా రెండో అతిపెద్ద దేశంగా ఉంది. బీర్ తయారీకి మరొక ముడి పదార్థం మాల్ట్ ఉత్పత్తిలో ఉక్రెయిన్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశం. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆగకుండా ఇలాగే మరికొంత కాలం జరిగితే బార్లీ కొరత ఏర్పడనుందని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో బార్లీ ధరలకు రెక్కలు వస్తాయంటున్నారు.
7.గీతాగోవిందం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఈ సినిమా తరువాత వెనక్కి చూసుకోకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగి పాన్ ఇండియా మూవీలో నటించే వరకు వచ్చింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం శర్వానంద్ సరసన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 4 న రిలీజ్ కానుంది.
8.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సినిమాలు గత కొంతకాలంగా దక్షిణాది భాషల్లోనూ అనువాదమౌతున్నాయి. ఆమె తాజా చిత్రం ‘ధాకడ్’ సైతం ఇప్పుడు హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్ కానుంది. చైల్డ్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ధాకడ్’ మూవీని నిజానికి గత యేడాది అక్టోబర్ 1న విడుదల చేయాల్సింది. కానీ కరోనా కారణంగా షూటింగ్ లో జాప్యం జరగడంతో ఈ యేడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ నెలలో ఎక్కువ సినిమాలు ఉండటంతో ఇప్పుడు దర్శక నిర్మాతలు కొత్త డేట్ ను ప్రకటించారు. మే 27వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు.
9.టీ20 ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు నమోదు చేశాడు. శ్రీలంకతో ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లో రోహిత్ 5 పరుగులకే ఔటయ్యాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్కే అవుటైన ఆటగాడిగా రోహిత్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ ఫార్మాట్లో రోహిత్ 45 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుటయ్యాడు. ఈ క్రమంలో ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ (44) చెత్త రికార్డును రోహిత్ క్రాస్ చేశాడు.
10.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. కరోనా కారణంగా ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు మార్చి 11 న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ కి రెండు వారాలే సమయం ఉండడంతో మేకర్స్ ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. ఇప్పటికే ఒకపక్క మెట్రో ట్రైన్స్ పై, థియేటర్ల వద్ద జ్యోతిషులతో కౌంటర్లు పెట్టించి డిఫరెంట్ గా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఇక మరోపక్క సోషల్ మీడియాలో సైతం సినిమా నుంచి రోజుకో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అంచనాలను పెంచేస్తున్నారు. ఇక తాజగా ఈ చిత్రం నుంచి కొత్త ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
