పెళ్లంటే సందడే సందడి.. బంధుమిత్రులు, పెళ్లికొడుకు, పెళ్లి కూతురు తరఫు బంధువులతో వివాహ వేడుక కళకళలాడుతుంది. మూడు ముళ్లు, ఏడడుగులు… కానీ వాటి వెనుక పరమార్థం ఏంటో చాలా కొద్దిమందికే తెలుసు. పెళ్లిళ్ళకు ఖరీదైన గిఫ్ట్ లు కొత్త దంపతులకు ఇవ్వడం ఆనవాయితీ. కానీ పెళ్లికి వచ్చిన వారికి మంచి బహుమతి ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆ దంపతులు. ఆ పెళ్లి వేడుక – పచ్చని కానుకలతో నిండిపోయింది. తమ పెళ్ళికి వచ్చి, తమకు ఆశీర్వచనం ఇచ్చిన బంధుమిత్రులకు మొక్కలు పంపిణీ చేశారు వధూవరులు.
కొత్తగా పెళ్లయిన ఆ జంట ప్రకృతిపై దృష్టి పెట్టారు.వందలాది మొక్కలను పంపిణీ చేసారు.వివాహాది శుభకార్యాలకు వచ్చే బంధుమిత్రులకు రకరకాల గిఫ్ట్లు ఇవ్వడం మనకు తెలిసిందే. అయితే వీరు పచ్చని మొక్కలను ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన ఈడుపుగంటి భూపయ్య చౌదరి కుమార్తె శ్రీలక్ష్మి కావ్య,ధీరజ్ కృష్ణ చైతన్యల వివాహ రిసెప్షన్ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను అందజేశారు.
ఈ మొక్కలను తీసుకెళ్లడానికి ప్రత్యేక ప్యాకింగ్ కూడా చేయించారు. నూతన వధూవరులను ఆశీర్వదించి ఈ మొక్కను అందుకోవడం అందరినీ ఆకట్టుకుంది. వేదికను కూడా పచ్చని మొక్కలు,ఆకులతో తీర్చిదిద్దారు. తాము పర్యావరణ ప్రేమికులమని, మాలాగే మీరు కూడా మొక్కలు పెంచి ప్రకృతిని కాపాడాలని కోరారు. ఈ వెరైటీ గిఫ్ట్ లు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. పర్యావరణ ప్రేమికులు ఈ జంటను అభినందిస్తున్నారు. సామాజిక స్పృహ అంటే ఇదే కదా.
Read Also: YashaSri: విమెన్స్ ఐపీఎల్లో ఆడుతుండటం సంతోషంగా ఉంది: యశ శ్రీ