కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం చనుగొండ్ల గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు గోపాల్ ఆత్మహత్య తనను తీవ్రంగా కలచివేసిందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. అతని తల్లిదండ్రులు స్తోమత లేకపోయినా రెక్కల కష్టంతో గోపాల్ ను ఉన్నత చదువులు చదివించారని తెలిపారు. రెండేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూసిన గోపాల్, తనకు ఉద్యోగం లేదని మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరే ఇతర కుటుంబానికి జరగకుండా పోరాటం చేయాలని గోపాల్ తమ్ముడు శ్రీనివాసులు రాసిన లేఖ తనకు అందిందని లోకేష్ వెల్లడించారు.
రెండేళ్ల పాలనలో 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదని లోకేష్ విమర్శించారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తామంటూ ఆశపెట్టి, ఇప్పుడు మాట తప్పారని, తద్వారా నిరుద్యోగ యువతను బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ ఇచ్చిన హామీ మేరకు జగన్ 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేసేంతవరకు తన పోరాటం ఆగదని.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ముందుండి పోరాటాన్ని నడిపిస్తానని లోకేష్ వరుస ట్వీట్లు చేశారు.
అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ ఆశ పెట్టి నిరుద్యోగ యువతను బలితీసుకుంటున్నారు @ysjagan. రెండేళ్ల పాలనలో 300 నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్నా వైకాపా ప్రభుత్వంలో చలనం లేదు.(1/5)#YCPJoblessCalendar pic.twitter.com/K7M8HMF8HH
— Lokesh Nara (@naralokesh) July 4, 2021